వైసీపీ మాజీ ఎమ్మెల్యే గనులపై మైనింగ్ శాఖ దాడి.. క్వారీ యంత్రాలు, వాహనాలు స్వాధీనం
- అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలంలో కాపు రామచంద్రారెడ్డి మైనింగ్
- నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ చేస్తున్నారని ఫిర్యాదులు
- పొక్లైన్లు, రవాణా వాహనాలను స్వాధీనం చేసుకున్న అధికారులు
అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం నేమకల్లు పరిధిలో అక్రమ మైనింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి చెందిన గనుల్లో లీజు నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా తవ్వకాలు సాగిస్తున్నారన్న ఫిర్యాదులపై మైనింగ్ శాఖ అధికారులు ఈరోజు మెరుపు దాడులు నిర్వహించారు.
సాంకేతిక బృందాలతో కలిసి రంగంలోకి దిగిన అధికారులు మైనింగ్ సరిహద్దులు, పరిమితికి మించిన క్వారీయింగ్ ఆరోపణలపై పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టారు. అధునాతన మ్యాపింగ్ ప్రక్రియ ద్వారా నిబంధనలను ఉల్లంఘించి ఎంత మొత్తం ఖనిజాన్ని అక్రమంగా తరలించారో తేల్చేందుకు సర్వే నిర్వహించారు. ఈ సోదాల సందర్భంగా.. మైనింగ్ నిర్వహణకు ఉపయోగిస్తున్న హెవీ యంత్రాలు, పొక్లైన్లు, రవాణా వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ తనిఖీలపై మైనింగ్ శాఖ అధికారులు మాట్లాడుతూ.. నేమకల్లు గనుల్లో జరిగిన నిబంధనల ఉల్లంఘనలపై సమగ్ర నివేదికను రూపొందించి ఉన్నతాధికారులకు సమర్పిస్తామని తెలిపారు. మైనింగ్ చట్టాల ప్రకారం బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా భారీగా జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. అక్రమ తవ్వకాలపై విచారణ కొనసాగుతోందని, ఉల్లంఘనలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు.