కరడుగట్టిన ఉగ్రవాదిపై ఉన్నట్టుండి రివార్డు పెంచిన పాక్‌.. అసలు మతలబు అదేనా?

కరడుగట్టిన ఉగ్రవాదిపై ఉన్నట్టుండి రివార్డు పెంచిన పాక్‌.. అసలు మతలబు అదేనా?

Masood Azhar reward increased by Pakistan ahead of FATF meeting
  • ఎఫ్‌ఐఏ రెడ్‌ బుక్‌లో మసూద్‌ పేరు
  • ఎఫ్‌ఏటీఎఫ్‌ సమావేశానికి ముందు కీలక నిర్ణయం
  • 26/11 నిందితుల పేర్లు కూడా జాబితాలో
  • భారత్‌ వాదనలను ఖండిస్తున్న పాక్‌
  • పాక్‌ చర్యలపై అంతర్జాతీయంగా అనుమానాలు
పాకిస్థాన్‌ హఠాత్తుగా కీలక నిర్ణయం తీసుకుంది. జైషే మహ్మద్‌ చీఫ్‌, మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది మసూద్‌ అజర్‌పై రివార్డును రూ.50 లక్షల నుంచి రూ.70 లక్షలకు పెంచింది. అంతేకాదు.. అతడి పేరును పాక్‌ ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎఫ్‌ఐఏ) ‘రెడ్‌ బుక్‌’లో చేర్చింది. బయటకు చూస్తే ఇది ఉగ్రవాదంపై పాక్‌ కఠిన వైఖరి తీసుకున్నట్లే కనిపిస్తోంది. కానీ అసలు కథ మాత్రం వేరే ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఎఫ్‌ఏటీఎఫ్‌ సమావేశానికి ముందు..
మసూద్‌ అజర్‌ భారత్‌లో జరిగిన పలు ఉగ్రదాడులకు ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా పుల్వామా ఉగ్రదాడి వెనుక అతడి హస్తం ఉందని భారత్‌ చెబుతోంది. ఇంత కీలకమైన ఉగ్రవాది పాకిస్థాన్‌లోనే తలదాచుకున్నాడన్న ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి.

అయితే మసూద్‌ తమ దేశంలో లేడని పాకిస్థాన్‌ గతంలో చెప్పింది. 2021లో అతడిపై రూ.50 లక్షల రివార్డు కూడా ప్రకటించింది. ఇప్పుడు మరో రూ.20 లక్షలు పెంచి.. ఏకంగా రూ.70 లక్షలకు చేర్చింది.

ఇదే సమయంలో వచ్చే నెల ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎఫ్‌) సమావేశం జరగనుంది. ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నారన్న ఆరోపణలపై పాకిస్థాన్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి ఉంది. ఈ నేపథ్యంలోనే తనపై చర్యలు తప్పించుకోవడానికి పాక్‌ ఈ నిర్ణయం తీసుకుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

‘రెడ్‌ బుక్‌’లో మసూద్‌ అజర్‌ ఒక్కరే కాదు..
పాక్‌ ఎఫ్‌ఐఏ తాజాగా విడుదల చేసిన రెడ్‌ బుక్‌లో మసూద్‌ అజర్‌తో పాటు 26/11 ముంబై ఉగ్రదాడులతో సంబంధం ఉన్న మరో 19 మంది పేర్లు ఉన్నాయి. ముంబైకి సముద్ర మార్గంలో ఉగ్రవాదులను తరలించడం, వారికి ఆర్థిక సహాయం చేయడం, దాడి నిర్వహణలో సహకరించడం వంటి ఆరోపణలు వారిపై ఉన్నాయి.

వీరిలో కొందరి పేర్లు, ఫొటోలు, దాడిలో వారి పాత్రకు సంబంధించిన వివరాలను కూడా ఎఫ్‌ఐఏ పొందుపరిచింది. 26/11 దాడుల్లో నిందితులుగా ఉన్న 17 మంది గత 18 ఏళ్లుగా పరారీలో ఉన్నారని పాక్‌ చెబుతోంది.

కానీ భారత నిఘా వర్గాల వాదన మరోలా ఉంది. వీరంతా పాకిస్థాన్‌లోనే సురక్షితంగా ఉన్నారని భారత్‌ ఆధారాలతో సహా చెబుతోంది. వారిపై పాక్‌ తీసుకుంటున్న చర్యలు అంతర్జాతీయ ఒత్తిడిని తగ్గించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలేనని స్పష్టం చేస్తోంది.

ఐదేళ్లలో ‘మోస్ట్‌ వాంటెడ్‌’ జాబితా పెరిగిందే..!
పాక్‌ ఎఫ్‌ఐఏ రెడ్‌ బుక్‌లో ఉన్న మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాదుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. 2021లో ఈ సంఖ్య 1,330గా ఉండగా.. ఇప్పుడు 1,804కు చేరింది. అంటే ఐదేళ్లలో దాదాపు 35 శాతం పెరిగింది.

అందుకే మసూద్‌ అజర్‌పై రివార్డు పెంపు నిజంగా ఉగ్రవాదంపై పాక్‌ పోరాటంలో భాగమేనా? లేక ఎప్‌ఏటీఎఫ్‌ వంటి అంతర్జాతీయ సంస్థల ముందు తనను తాను కాపాడుకునేందుకు వేసిన వ్యూహమా? అన్న ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ఉగ్రవాదులకు ఆశ్రయం లేదని చెబుతూనే, వారికి పూర్తి అండదండలతో ఆశ్రయం కల్పించే పాకిస్థాన్‌.. అదే ఉగ్రవాదులను ‘మోస్ట్‌ వాంటెడ్‌’ జాబితాలో చేర్చడం వెనుక అసలు ఉద్దేశం ఏంటన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

కాగా, అజర్ పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని నవాబ్‌షా నగరంలోనే తలదాచుకున్నట్లు భారత నిఘా వర్గాలు బలంగా విశ్వసిస్తున్నాయి.
Advertisement
Masood Azhar
Jaish-e-Mohammed Chief
Pakistan FIA Red Book
FATF Meeting Pakistan
Mumbai Terror Attacks
Pakistan Most Wanted List

More Telugu News