దిశ కేసులో సంచలనం.. ఎఫ్ఐఆర్‌లో ఉద్ధవ్ థాకరే, ఆదిత్య థాకరేతో పాటు నటి రియా చక్రవర్తి

దిశ కేసులో సంచలనం.. ఎఫ్ఐఆర్‌లో ఉద్ధవ్ థాకరే, ఆదిత్య థాకరేతో పాటు నటి రియా చక్రవర్తి

Aaditya Thackeray and actress Rhea Chakraborty named in Disha Salian case CBI FIR
  • దిశ శాలియన్ మృతి కేసులో సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు
  • ఆదిత్య థాకరే, రియా చక్రవర్తిలతో పాటు పలువురు ప్రముఖుల పేర్లు
  • కుట్ర, సాక్ష్యాల ధ్వంసం వంటి తీవ్ర అభియోగాలపై దర్యాప్తు
  • బాంబే హైకోర్టు ఆదేశాలతో సీబీఐ విచారణ ప్రారంభం
దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశ శాలియన్ మృతి కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కీలక పురోగతి సాధించింది. బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ సోమవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో శివసేన (యూబీటీ) నేత ఆదిత్య థాకరే, నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి సహా పలువురు ప్రముఖుల పేర్లను చేర్చడం ఇప్పుడు సంచలనంగా మారింది.

సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఆదిత్య థాకరే, రియాతో పాటు నటులు డీనో మోరియా, సూరజ్ పంచోలి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్, మాజీ పోలీస్ అధికారులు సచిన్ వాజే, పరమ్ వీర్ సింగ్ వంటి కీలక వ్యక్తుల పేర్లు ఉన్నాయి. నేరపూరిత కుట్రకు పాల్పడటం, సాక్ష్యాలను ధ్వంసం చేయడం, ఆత్మహత్యగా తప్పుడు ప్రచారం చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై వీరిని విచారించనున్నారు. నాటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఈ కేసును తప్పుదోవ పట్టించడంలో, నిందితులను కాపాడటంలో కీలక పాత్ర పోషించారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొనడం గమనార్హం.

2020 జూన్ 8న ముంబైలోని ఓ భవనంపై నుంచి పడి దిశ శాలియన్ మృతి చెందారు. ఆరు రోజుల తర్వాత, జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన నివాసంలో విగతజీవిగా కనిపించారు. అప్పట్లో ముంబై పోలీసులు దిశ మృతిని ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా నమోదు చేసి, అనంతరం ఆత్మహత్యగా తేల్చారు. అయితే, సుదీర్ఘ కాలంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడంపై బాంబే హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

ముంబై పోలీసుల దర్యాప్తు "సమాధానాల కంటే మరిన్ని సందేహాలనే రేకెత్తిస్తోందని" వ్యాఖ్యానిస్తూ, ఈ కేసును సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ కేసును కప్పిపుచ్చేందుకు నాటి ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం ప్రయత్నించిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీరితో పాటు మల్వానీ పోలీస్ స్టేషన్ అధికారులు, పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు, ఫోరెన్సిక్ సిబ్బంది, భవనం సెక్యూరిటీ గార్డుల పాత్రపై కూడా సీబీఐ క్షుణ్ణంగా దర్యాప్తు చేయనుంది.
Advertisement
Aaditya Thackeray
Rhea Chakraborty
Disha Salian Case
CBI FIR
Sushant Singh Rajput
Bombay High Court

More Telugu News