భారత్‌కు రానున్న పాక్‌ హాకీ టీమ్‌.. పంజాబ్‌ సీఎం కీలక ప్రకటన

భారత్‌కు రానున్న పాక్‌ హాకీ టీమ్‌.. పంజాబ్‌ సీఎం కీలక ప్రకటన

Pakistan Hockey Team to visit India Punjab CM makes key announcement
  • భారత్‌లో ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ
  • అక్టోబర్‌ 27 నుంచి పోటీలు
  • పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లకే అనుమతి లేదన్న మాన్‌
  • బహుళ దేశాలు పాల్గొనే టోర్నీలకు ఇబ్బంది లేదని వివరణ
భారత్‌లో జరగనున్న ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ హాకీ టోర్నీలో పాకిస్థాన్‌ జట్టు కూడా పాల్గొననుంది. ఈ విషయాన్ని పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ సోమవారం వెల్లడించారు. బహుళ దేశాలు పాల్గొనే అంతర్జాతీయ టోర్నీల్లో భారత్‌-పాకిస్థాన్‌ జట్లు తలపడేందుకు కేంద్ర క్రీడా విధానం అనుమతిస్తుందని ఆయన తెలిపారు.

అక్టోబర్‌ 27 నుంచి నవంబర్‌ 5 వరకు ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ జరగనుంది. భారత్‌, పాకిస్థాన్‌, చైనా, జపాన్‌, మలేసియా, కొరియా జట్లు టోర్నీలో పాల్గొంటాయి. లీగ్‌ దశ మ్యాచ్‌లు జలంధర్‌లోని హాకీ స్టేడియంలో జరుగుతాయి. సెమీఫైనల్స్‌, ఫైనల్‌ మొహాలీలో నిర్వహిస్తారు. ఒమన్‌, బంగ్లాదేశ్‌ జట్లను రిజర్వ్‌ టీమ్‌లుగా ఎంపిక చేశారు.

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లకు మాత్రం అనుమతి లేదని మాన్‌ స్పష్టం చేశారు. అయితే బహుళ దేశాల టోర్నీల్లో ఇరు జట్లు తలపడటానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఒలింపిక్‌ చార్టర్‌కు అనుగుణంగా ఈ విధానం కొనసాగుతోందని తెలిపారు.

గత ఏడాది తమిళనాడులో జరిగిన జూనియర్‌ ప్రపంచకప్‌ హాకీ నుంచి పాకిస్థాన్‌ జట్టు తప్పుకొంది. భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులే ఇందుకు కారణమని అప్పట్లో పాక్‌ పేర్కొంది.

ఈసారి మాత్రం పాకిస్థాన్‌ జట్టు భారత్‌లోనే ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ ఆడనుంది. టోర్నీ నిర్వహణకు పంజాబ్‌ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భగవంత్‌ మాన్‌ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో తొలిసారి ఈ టోర్నీ జరుగుతుండటంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తామని చెప్పారు.

ఇదిలా ఉంటే.. భారత్‌, పాకిస్థాన్‌ హాకీ సమాఖ్యల మధ్య సంబంధాలు చాలా బాగున్నాయని హాకీ ఇండియా ప్రధాన కార్యదర్శి భోలా నాథ్‌ సింగ్‌ తెలిపారు. మ్యాచ్‌లో ఎవరు గెలిచినా ఇరు జట్ల ఆటగాళ్లు పరస్పరం గౌరవించుకుంటారని చెప్పారు.
Advertisement
Pakistan Hockey Team
Bhagwant Mann
Asian Champions Trophy
India vs Pakistan Hockey
Punjab Hockey Tournament
Asian Hockey Champions Trophy

More Telugu News