టీడీపీ కార్యకర్త హత్య.. కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేత
- టీడీపీ కార్యకర్త బాలయ్య హత్య కేసులో కీలక నిందితుడు సత్యనారాయణ రెడ్డి
- నాయుడుపేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో లొంగుబాటు
- 14 రోజుల పాటు రిమాండ్ విధించిన కోర్టు
నెల్లూరు, తిరుపతి జిల్లాల సరిహద్దు ప్రాంతంలో సంచలనం సృష్టించిన టీడీపీ కార్యకర్త బాలయ్య హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ నేత కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి నాయుడుపేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో లొంగిపోయారు. పిటిషన్ను విచారించిన న్యాయస్థానం ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. దీంతో, పోలీసులు ఆయనను భద్రత నడుమ నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు.
పెళ్లకూరు మండలం చిల్లకూరు ప్రాంతంలోని కాల్వలు, ప్రభుత్వ పోరంబోకు భూములను సత్యనారాయణ రెడ్డి ఆక్రమించారంటూ స్థానిక టీడీపీ నేతలు గతంలో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారుల సంయుక్త సర్వేలో ఆక్రమణ నిజమేనని తేలింది. ఆక్రమిత స్థలంలో తన సొంత పొలానికి దారి వేసుకునేందుకు సత్యనారాయణరెడ్డి ప్రయత్నించగా టీడీపీ కార్యకర్త బాలయ్య సహా పలువురు అడ్డుకుని ప్రశ్నించారు. దీంతో ఆక్రోశానికి గురైన సత్యనారాయణరెడ్డి, తన అనుచరులతో కలిసి టీడీపీ నేతలపై దాడికి తెగబడ్డారు.
ఈ గొడవలో బాలయ్య ఛాతీపై ప్రత్యర్థులు పిడిగుద్దులతో విరుచుకుపడటంతో ఆయన తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు సత్యనారాయణ రెడ్డిని ఏ1 నిందితుడిగా చేర్చి కేసు నమోదు చేయగా... పోలీసు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఆయన చివరకు కోర్టులో లొంగిపోవాల్సి వచ్చింది.