‘టీమిండియాకు దూరమైన తర్వాత ఆకలి పెరిగింది’.. దులీప్ ట్రోఫీ విజయం తర్వాత ఇషాన్‌

‘టీమిండియాకు దూరమైన తర్వాత ఆకలి పెరిగింది’.. దులీప్ ట్రోఫీ విజయం తర్వాత ఇషాన్‌

Ishan Kishan says hunger to play increased after being away from Team India
  • 13 ఏళ్ల తర్వాత దులీప్‌ ట్రోఫీ గెలిచిన ఈస్ట్‌ జోన్‌
  • ఈ విజయానికి సమష్టి కృషి, ఐక్యతే కారణమన్న కెప్టెన్‌ ఇషాన్‌
  • ఒకరికొకరు అండగా నిలిచినట్లు వెల్లడి
  • జాతీయ జట్టుకు దూరమైన తర్వాత తనలో మార్పు వచ్చినట్లు వ్యాఖ్య
  • జట్టు కోసం ఆడడం, టైటిల్‌ గెలవడమే తన లక్ష్యమని స్పష్టీకరణ
దులీప్‌ ట్రోఫీలో ఈస్ట్‌ జోన్‌ 13 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఫైనల్లో సౌత్‌ జోన్‌పై ఆధిపత్యం ప్రదర్శించి టైటిల్‌ సొంతం చేసుకుంది. ఈ విజయానికి జట్టు సమష్టి కృషి, ఐక్యతే కారణమని కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ చెప్పాడు.

‘‘ఈ విజయం మా అందరిదీ. ఒకరికొకరం అండగా నిలిచాం. అదే ఈ జట్టు బలం. నాయకుడిగా నేను కూడా నా వంతు బాగానే చేశాననుకుంటా’’ అంటూ ఇషాన్‌ నవ్వుతూ చెప్పాడు. అయితే విజయంతో ప్రయాణం ముగియదని అన్నాడు. బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌ ఇలా అన్ని విభాగాల్లో ఇంకా మెరుగుపడాల్సి ఉందని తెలిపాడు.

ఫైనల్లో ఇషాన్‌ కిషన్‌ కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 270 పరుగులతో భారీ ఇన్నింగ్స్‌ ఆడాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ 80 పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన భారీ ఆధిక్యంతో ఈస్ట్‌ జోన్‌కు విజయం ఖాయమైంది. దీంతో 2012-13 సీజన్‌ తర్వాత తొలిసారి దులీప్‌ ట్రోఫీని గెలుచుకుంది.

జాతీయ జట్టుకు దూరంగా ఉన్న సమయంలో తనలో చాలా మార్పు వచ్చిందని ఇషాన్‌ చెప్పాడు. ఇప్పుడు మరింత ప్రశాంతంగా ఉంటున్నానని, పరిస్థితులను బాగా అర్థం చేసుకుంటున్నానని చెప్పాడు. జట్టు కోసం ఆడాలనే ఆకలి తనలో మరింత పెరిగిందన్నాడు. జట్టు కోసం ఆడడం, టైటిల్‌ గెలవడమే ఇప్పుడు తన లక్ష్యమని స్పష్టం చేశాడు.

కెప్టెన్‌గా ఇషాన్‌కు ఇది రెండో దేశవాళీ టైటిల్‌. 2025-26 సీజన్‌లో సొంత రాష్ట్రం ఝార్ఖండ్‌కు సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ అందించాడు.
Advertisement
Ishan Kishan
Duleep Trophy
East Zone
South Zone
MA Chidambaram Stadium
Indian Cricket Team

More Telugu News