ఏపీ మద్యం కేసులో రాజ్ కెసిరెడ్డి, వాసుదేవరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
- మద్యం కుంభకోణం తీవ్ర ఆర్థిక నేరమన్న సుప్రీంకోర్టు
- ఈడీతో పాటు రాష్ట్ర విచారణ బృందాల దర్యాప్తు సమాంతరంగా సాగడంలో తప్పు లేదని వ్యాఖ్య
- బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన ధర్మాసనం
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రాజ్ కెసిరెడ్డి, వాసుదేవరెడ్డిలకు సర్వోన్నత న్యాయస్థానంలో తీవ్ర విఘాతం ఎదురైంది. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని వారు దాఖలు చేసిన పిటిషన్లను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నాయకత్వంలోని ధర్మాసనం కొట్టివేసింది. ఈ సందర్భంగా కేసు తీవ్రతను ప్రస్తావించిన సీజేఐ... ఇది తీవ్రమైన ఆర్థిక నేరమని వ్యాఖ్యానించారు.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన ఆర్థిక అక్రమాల కేసుతో పాటు రాష్ట్ర పోలీసుల ప్రత్యేక విచారణ బృందాల (సిట్, సీఐడీ) దర్యాప్తు ఒకే సమయంలో సమాంతరంగా సాగడంలో తప్పులేదని కోర్టు తేల్చిచెప్పింది. నిందితులు ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్నారని న్యాయవాదులు తెలుపగా... ఈడీ కస్టడీ పూర్తయిన తక్షణమే సిట్ కస్టడీకి అప్పగించేలా ప్రొడక్షన్ వారెంట్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించింది.
ముందస్తు బెయిల్ పిటిషన్ను తోసిపుచ్చిన ధర్మాసనం... సిట్ విచారణ ప్రక్రియ ముగిసిన అనంతరం నిందితులు సంబంధిత కింది కోర్టులోనే రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. కేసుకు సంబంధించిన అంశాలు, మెరిట్స్ ఆధారంగా మాత్రమే ఆ బెయిల్ దరఖాస్తును కింది కోర్టు పరిశీలిస్తుందని స్పష్టం చేసింది.