రేపు కోనసీమ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. షెడ్యూల్ ఇదే!

రేపు కోనసీమ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. షెడ్యూల్ ఇదే!

Chandrababu Naidu Konaseema district visit tomorrow full schedule
  • మీ భూమి–మీ హక్కు' కార్యక్రమంలో భాగంగా పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ
  • రైతులతో నేరుగా సమావేశమై సమస్యలు తెలుసుకోనున్న సీఎం
  • గ్రౌండ్ రెంట్ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించే ప్రక్రియకు శ్రీకారం
  • 1,416 కుటుంబాలకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పాలనను పరుగులు పెట్టిస్తున్న ఆయన, ఈ పర్యటనలో భాగంగా పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా పి. గన్నవరం నియోజకవర్గంలో నిర్వహించే గ్రామసభలో పాల్గొని, లబ్ధిదారులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. ఈ పర్యటనలో రైతులతో ముఖాముఖి, గ్రామసభ, పార్టీ కేడర్‌తో సమావేశం వంటి కార్యక్రమాలు ఉన్నాయి. దశాబ్దాలుగా నలుగుతున్న గ్రౌండ్ రెంట్ భూముల సమస్య పరిష్కారానికి ఈ పర్యటనలో కీలక అడుగు పడనుంది.

ముఖ్యమంత్రి పర్యటన పూర్తి షెడ్యూల్

ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ ఈ విధంగా ఉంది. ఉదయం 9:45 గంటలకు ఉండవల్లిలోని నివాసం నుంచి బయలుదేరి, 10:30 గంటలకు అంబాజీపేట మండలం ఇరుసుమండ చేరుకుంటారు. అక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశమవుతారు. అనంతరం 10:45 గంటలకు రోడ్డు మార్గంలో మాచవరం గ్రామంలోని జయంతి నగర్‌కు బయలుదేరతారు. ఉదయం 10:55 నుంచి 11:35 గంటల వరకు జయంతి నగర్‌లో ఏర్పాటు చేసిన ‘రైతులతో ముఖాముఖి’ కార్యక్రమంలో పాల్గొంటారు. రైతుల సమస్యలు, అభిప్రాయాలను నేరుగా అడిగి తెలుసుకుంటారు.

అక్కడి నుంచి బయలుదేరి 11:40 గంటలకు పండువారిపేటలోని గ్రామసభ వేదికకు చేరుకుంటారు. మధ్యాహ్నం 1:55 గంటల వరకు ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేసి, భూ హక్కుల పరిరక్షణపై ప్రజలకు వివరిస్తారు. మధ్యాహ్నం 3:15 గంటలకు బుడుంగపేటలో జరిగే కేడర్ సమావేశంలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం 4:50 గంటలకు ఇరుసుమండ నుంచి తిరుగు ప్రయాణమై, 5:40 గంటలకు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయానికి చేరుకోవడంతో పర్యటన ముగుస్తుంది.

గ్రౌండ్ రెంట్ భూములకు విముక్తి

కోనసీమ జిల్లాలో దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని గ్రౌండ్ రెంట్ భూముల సమస్యకు ఈ పర్యటనలో ముగింపు పలకనున్నారు. అమలాపురం, అంబాజీపేట, ముమ్మిడివరం, రామచంద్రాపురం ప్రాంతాల్లోని 56.37 ఎకరాల నివాస స్థలాలు పాత రెవెన్యూ రికార్డుల కారణంగా రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22-A నిషేధిత జాబితాలో ఉన్నాయి. దీంతో 1,416 కుటుంబాలు తమ ఆస్తులపై హక్కులున్నా క్రయవిక్రయాలు చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. క్షేత్రస్థాయి విచారణల అనంతరం, ఈ భూములను 22-A జాబితా నుంచి తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నిర్ణయంతో 1,281 సర్వే నంబర్లకు సంబంధించిన సమస్యలు పరిష్కారమై, వేలాది మందికి ఉపశమనం కలగనుంది.

‘మీ భూమి–మీ హక్కు’తో భరోసా

‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమాన్ని ప్రభుత్వం కేవలం పట్టాల పంపిణీగా కాకుండా, రైతు గౌరవాన్ని, పౌరుడి ఆస్తి హక్కును కాపాడే ఉద్యమంగా చూస్తోంది. గత ప్రభుత్వ హయాంలో రీ-సర్వేలో జరిగిన తప్పులను సరిదిద్ది, స్పష్టమైన భూ రికార్డులు అందించేందుకు ‘రీ-సర్వే 2.0’ను అమలు చేస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా 36 లక్షలకు పైగా పాస్‌పుస్తకాలు పంపిణీ చేయగా, వచ్చే మార్చి నాటికి రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ‘నీరు జీవం... భూమి జీవితం’ అనే నినాదంతో పంటకు నీటి భరోసాతో పాటు, ఆస్తికి హక్కు భరోసా కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవడమే నిజమైన పాలన అని భావించే చంద్రబాబు, ఈ పర్యటన ద్వారా కోనసీమ వాసులకు భూ హక్కుల భరోసా కల్పించనున్నారు.
Advertisement
Chandrababu Naidu
Konaseema district visit
Mee Bhoomi Mee Hakku
Ground rent lands issue
Andhra Pradesh CM schedule
P Gannavaram Gram Sabha

More Telugu News