తెలంగాణ మండలిలో హైటెన్షన్.. ఎమ్మెల్సీ తాతా మధును లాక్కెళ్లిన మార్షల్స్

తెలంగాణ మండలిలో హైటెన్షన్.. ఎమ్మెల్సీ తాతా మధును లాక్కెళ్లిన మార్షల్స్

High tension in Telangana Council Marshals drag out MLC Tata Madhu
  • తెలంగాణ శాసనమండలి ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత
  • మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీ తాతా మధును అడ్డుకున్న మార్షల్స్
  • వెళ్లేందుకు నిరాకరించడంతో బలవంతంగా ఎత్తుకెళ్లి బయటకు తరలింపు
  • స్పీకర్‌పై వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకున్న అధికారులు
తెలంగాణ శాసనమండలి ప్రాంగణంలో మంగళవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును మార్షల్స్ బలవంతంగా ప్రాంగణం వెలుపలికి తరలించారు. ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి నెలకొంది.

మండలి ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద మాట్లాడేందుకు ఎమ్మెల్సీ తాతా మధు ప్రయత్నించారు. అయితే, ఆయనపై ఇప్పటికే సస్పెన్షన్ వేటు పడినందున, మండలి ఆవరణలో మాట్లాడేందుకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆయనకు సూచించారు.

అయినప్పటికీ, అధికారుల సూచనను తిరస్కరించిన తాతా మధు, అక్కడే ఉండేందుకు ప్రయత్నించారు. దీంతో మార్షల్స్ రంగప్రవేశం చేసి, ఆయన్ను బలవంతంగా అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. ఆయన నిరాకరించడంతో, మార్షల్స్ ఆయనను చేతులపై ఎత్తుకుని ప్రాంగణం వెలుపలికి తీసుకెళ్లారు. అసెంబ్లీ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో తాతా మధుపై సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే, మండలి ప్రాంగణంలో ఆయనను మాట్లాడకుండా అధికారులు అడ్డుకున్నారు.
Advertisement
Tata Madhu
Telangana Legislative Council
BRS MLC Suspension
Telangana Assembly Marshals
Hyderabad Political News

More Telugu News