చంద్రబాబు అపాయింట్‌మెంట్ కోరిన వివేకా కేసు అప్రూవర్ దస్తగిరి

చంద్రబాబు అపాయింట్‌మెంట్ కోరిన వివేకా కేసు అప్రూవర్ దస్తగిరి

Sheikh Dastagiri seeks appointment with CM Chandrababu Naidu
  • ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు అమరావతికి వచ్చిన దస్తగిరి
  • వైసీపీ ప్రభుత్వంలో బెదిరించిన అధికారులే ఇంకా వేధిస్తున్నారని ఆరోపణ
  • వివేకా హత్య కేసు, మనీలాండరింగ్‌పై సీఎంకు వివరాలు అందిస్తానని వెల్లడి
  • జగన్, భారతి విచారణ సంస్థలకు సహకరించాలని డిమాండ్
  • పులివెందులకు వెళ్లాలంటే భయంగా ఉందన్న దస్తగిరి భార్య షబానా
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరి, ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు మంగళవారం అమరావతికి చేరుకున్నాడు. గత ప్రభుత్వంలో తనను వేధించిన అధికారులే ఇప్పటికీ ఇబ్బందులకు గురిచేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎంకు ఒక వినతిపత్రం సమర్పించేందుకు అమరావతి వచ్చినట్టు వెల్లడించాడు. తన భార్య షేక్ షబానాతో కలిసి వచ్చిన దస్తగిరి, సీఎం అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నట్లు మీడియాకు తెలిపాడు.

ఈ సందర్భంగా దస్తగిరి మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు. ఇప్పుడు జగన్ కు తాను నైతిక విలువలు చెప్పాల్సి వస్తోందని, జగన్ ఆ స్థాయికి దిగజారారని ఎద్దేవా చేశాడు. రాష్ట్రం గురించి మాట్లాడే ముందు, బాబాయి కూతురికి న్యాయం చేయాలని హితవు పలికాడు. తాను న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా నుంచి వకాల్తా తీసుకున్నట్లు నిరూపిస్తే జైలుకు వెళ్లడానికి సిద్ధమని, ఒకవేళ నిరూపించలేకపోతే జగన్ రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అని సవాల్ విసిరాడు. వివేకా హత్య కేసులో జగన్, ఆయన భార్య భారతి విచారణ సంస్థలకు పూర్తిగా సహకరించాలని దస్తగిరి డిమాండ్ చేశాడు.

అంతేకాకుండా, వివేకా హత్య కేసు, సంబంధిత మనీలాండరింగ్ వ్యవహారాలపై తన వద్ద ఉన్న కీలక వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేస్తానని దస్తగిరి స్పష్టం చేశాడు. "గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నన్ను చంపేస్తామని బెదిరించిన అధికారులే ఇప్పటికీ నా వెంటపడుతున్నారు. వారి వేధింపులు భరించలేకపోతున్నాం. అందుకే మా గోడును సీఎంతో చెప్పుకోవడానికి వచ్చాం" అని దస్తగిరి ఆవేదన వ్యక్తం చేశాడు.

దస్తగిరి భార్య షబానా మాట్లాడుతూ, తాము పులివెందులకు వెళ్లాలంటేనే భయంగా ఉందని కన్నీటిపర్యంతమైంది. తమ కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, న్యాయం పొందాలనే ఆశతో అమరావతికి వచ్చామని ఆమె తెలిపింది. సీఎంను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేసింది.
Advertisement
Sheikh Dastagiri
Chandrababu Naidu
YS Vivekananda Reddy Murder Case
Amaravati
YS Jagan Mohan Reddy
Andhra Pradesh Politics

More Telugu News