డీఎస్సీపై వైసీపీ చేస్తున్నది 100 శాతం దుష్ప్రచారమే: ఎమ్మెల్యే బోడే ప్రసాద్

డీఎస్సీపై వైసీపీ చేస్తున్నది 100 శాతం దుష్ప్రచారమే: ఎమ్మెల్యే బోడే ప్రసాద్

Bode Prasad Slams YCP For False Propaganda On DSC Recruitment
  • ఓటు బ్యాంకు భయంతోనే డీఎస్సీపై విష ప్రచారం చేస్తోందన్న బోడే ప్రసాద్ప్రభుత్వ విజయాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ కుట్ర అని ఆరోపణ
  • యువత సహనాన్ని పరీక్షించవద్దని వైసీపీకి తీవ్ర హెచ్చరిక
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని స్పష్టీకరణ 
టీడీపీ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించిన డీఎస్సీ నియామకాలపై వైసీపీ చేస్తున్నది 100 శాతం దుష్ప్రచారమేనని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తీవ్రంగా విమర్శించారు. కూటమి ప్రభుత్వం సాధిస్తున్న విజయాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే వైసీపీ ఈ తరహా డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపిందని ఆయన ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెలిగొండ ప్రాజెక్టు, పోలవరం ఎడమ కాలువ నుంచి నీటిని విడుదల చేయడంతో రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో తమ ఓటు బ్యాంకుకు నష్టం జరుగుతుందనే భయం వైసీపీని వెంటాడుతోందని బోడే ప్రసాద్ అన్నారు. అందుకే ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ భుజానికెత్తుకున్నారని విమర్శించారు. డీఎస్సీలో మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులపై కూడా అక్రమాలు జరిగాయంటూ ఒక పత్రికను అడ్డుపెట్టుకుని విష ప్రచారం చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా తన నియోజకవర్గంలోని ఇద్దరు అక్కాచెల్లెళ్ల ఉదంతాన్ని ఆయన ఉదహరించారు. సొంత ఇల్లు కూడా లేక అద్దె ఇంట్లో ఉంటున్న ఆ యువతులు కష్టపడి చదివి డీఎస్సీలో ఉద్యోగాలు సాధించారని, వారిలో ఒకరు 2019లో కేవలం ఒక్క మార్కు తేడాతో ఉద్యోగం కోల్పోయారని తెలిపారు. ఐదేళ్ల తర్వాత వారి కల నెరవేరితే, వారి మెరిట్‌ను కూడా ప్రశ్నిస్తూ వైసీపీ నేతలు అవమానించడం బాధాకరమన్నారు. ఏపీపీఎస్సీకి, డీఎస్సీకి తేడా తెలియని వారు గతంలో యువత జీవితాలతో ఆడుకున్నారని ఆరోపించారు.

గతంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో చేసిన తరహాలోనే ఇప్పుడు డీఎస్సీ అభ్యర్థులపై అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన వేలాది మంది యువత సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు. యువత తిరగబడితే దాని ప్రభావం ఎలా ఉంటుందో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి తెలుస్తుందని అన్నారు. డీఎస్సీపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజల్లోకి వెళ్లి తిప్పికొడతామని బోడే ప్రసాద్ స్పష్టం చేశారు.


Advertisement
Bode Prasad
DSC Recruitment Andhra Pradesh
YCP Propaganda
TDP Government
Penamaluru MLA
AP Teacher Jobs

More Telugu News