రూ.22 వేల కోట్ల రుణం.. జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్‌ చంద్ర చెల్లించేది రూ.6.5 కోట్లే!

Subhash Chandra to pay only 65 crore for 22000 crore loan
  • రుణదాతలకు 99.97 శాతం నష్టం
  • రూ.100కు సుమారు 3 పైసలే రికవరీ
  • 80.81 శాతం ఓటింగ్‌ వాటా ప్రతిపాదనకు మద్దతు
  • ప్రతిపాదనను వ్యతిరేకించిన ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌
  • దివాలాతో మరింత నష్టం జరిగే అవకాశం ఉందని ఎన్‌సీఎల్‌టీ అభిప్రాయం
జీ గ్రూప్‌ వ్యవస్థాపకుడు సుభాష్‌ చంద్రకు సంబంధించిన వ్యక్తిగత దివాలా కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రూ.22,006.57 కోట్ల మేర రుణదాతల క్లెయిమ్‌లకు గాను కేవలం రూ.6.5 కోట్లు చెల్లించే ప్రతిపాదనకు నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఆమోదం తెలిపింది. దీంతో రుణదాతలకు దాదాపు 99.97 శాతం నష్టం వాటిల్లనుంది. అంటే రూ.100 బకాయికి సుమారు 3 పైసలు మాత్రమే తిరిగి వచ్చే పరిస్థితి.

ఈ ప్రతిపాదనకు కొందరు రుణదాతలు తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కూడా వ్యతిరేకించింది. ఆ సంస్థకు సుభాష్‌ చంద్ర నుంచి రావాల్సిన మొత్తం రూ.1,322.39 కోట్లు. కానీ ప్రతిపాదించిన చెల్లింపు కేవలం రూ.38 లక్షలు.

అయితే ప్రతిపాదనను వ్యతిరేకించిన రుణదాతల ఓటింగ్‌ వాటా 20 శాతంలోపే ఉంది. మరోవైపు 80.81 శాతం ఓటింగ్‌ వాటా ఉన్న రుణదాతలు ప్రతిపాదనకు మద్దతు ఇచ్చారు. దీంతో మెజారిటీ రుణదాతల నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని ఎన్‌సీఎల్‌టీ స్పష్టం చేసింది.

సుభాష్‌ చంద్ర వ్యక్తిగత ఆస్తుల విలువను కూడా ట్రైబ్యునల్‌ పరిశీలించింది. ఆ ఆస్తుల విలువ ప్రతిపాదించిన మొత్తంతో పోలిస్తే తక్కువగా ఉన్నట్లు గుర్తించింది. ప్రతిపాదన తిరస్కరించి ఆయన్ను దివాలా ప్రక్రియలోకి పంపితే రుణదాతలకు మరింత తక్కువ మొత్తం మాత్రమే దక్కే అవకాశం ఉందని పేర్కొంది.

ఈ కేసు 2022లో ప్రారంభమైంది. వివేక్‌ ఇన్‌ఫ్రాకాన్‌ తీసుకున్న రూ.170 కోట్ల రుణానికి సుభాష్‌ చంద్ర వ్యక్తిగత హామీ ఇచ్చారు. రుణ చెల్లింపులు నిలిచిపోవడంతో ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఆయనపై దివాలా చర్యలకు వెళ్లింది. 2024 ఏప్రిల్‌లో ఎన్‌సీఎల్‌టీ వ్యక్తిగత దివాలా ప్రక్రియను ఆమోదించింది.

అయితే ఈ తీర్పుపై న్యాయ నిపుణుడు అభిషేక్‌ స్వరూప్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. 99 శాతానికి పైగా రుణాన్ని మాఫీ చేసే ప్రతిపాదనను ‘వాణిజ్యపరమైన విచక్షణ’గా పరిగణించలేమని అన్నారు. ఇలాంటి నిర్ణయం భవిష్యత్తులో వ్యక్తిగత దివాలా కేసులపై ప్రభావం చూపవచ్చని పేర్కొన్నారు.
Advertisement
Subhash Chandra
Zee Group
NCLT
Bankruptcy
Loan Settlement
LIC Housing Finance

More Telugu News