జగన్ గతంలో ఆవు కథ చెప్పేవారు.. ఇప్పుడు కోతి, పులి కథలు చెబుతున్నారు: మంత్రి పార్థసారథి

Kolusu Parthasarathy Slams Jagan Over Monkey and Tiger Stories Remark
  • జగన్‌కు ఇప్పుడే ఎల్ నినో గుర్తొచ్చిందా? అంటూ మంత్రి పార్థసారథి ఫైర్
  • బీసీ రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టులో ఎందుకు పోరాడలేదని నిలదీత
  • ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని సవాల్
  • రాయలసీమ ప్రాజెక్టులపై జగన్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలేనని విమర్శలు
  • సెప్టెంబర్ 3న ఉత్తరాంధ్రకు పోలవరం జలాలు అందిస్తామని వెల్లడి 
గత రెండేళ్లుగా బెంగళూరులో సేద తీరిన మాజీ ముఖ్యమంత్రి జగన్ కు అకస్మాత్తుగా ఇప్పుడు 'ఎల్ నినో' గుర్తుకు వచ్చిందా?" అని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే, శాసనసభకు వచ్చి చర్చించాలే గానీ, సొంత మీడియా ముందు మాట్లాడటం సరికాదని హితవు పలికారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్థసారథి మాట్లాడుతూ.. బీసీలు, రైతులపై జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నారని, ఆయన చెప్పే అబద్ధాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని స్పష్టం చేశారు. జగన్ ఇదివరకు ఆవు కథ చెప్పేవారు, ఇప్పుడు కోతి, పులి కథలు చెబుతున్నారు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.


గత ఐదేళ్ల పాలనలో కనీసం ఒక్క కరవు నివారణ చర్య కూడా చేపట్టని బలహీన ముఖ్యమంత్రి జగన్ అని పార్థసారథి విమర్శించారు. "బెంగళూరులో ఉన్న జగన్‌కు ఎల్ నినో గురించి తెలియకపోవచ్చు. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా గుర్తుకు వచ్చింది. ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కూటమి ప్రభుత్వం ముందునుంచే చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు, కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తక్కువ నీటితో అధిక దిగుబడినిచ్చే వరి వంగడాలను ప్రోత్సహిస్తున్నాం. వరి, మినుము, పత్తి వంటి పంటలకు తక్కువ ప్రీమియంతోనే బీమా చేయిస్తున్నాం" అని వివరించారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు చేసిన ద్రోహం, విధ్వంసం బయటపడుతుందనే భయంతోనే జగన్ అసెంబ్లీకి రావడం లేదని ఆరోపించారు.

మండలిలో చర్చకు ఎందుకు రాలేదు?
రైతులపై అంత ప్రేమ ఉంటే, ఎల్ నినో అంశంపై శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీలతో ఎందుకు చర్చకు పట్టుబట్టలేదని మంత్రి పార్థసారథి ప్రశ్నించారు. "విలువైన మండలి సమయాన్ని డిప్యూటీ ఛైర్మన్‌ను పొగడటానికే సరిపెట్టారు. నాలుగు గంటలపాటు కూటమి ప్రభుత్వంపై విషం చిమ్ముతూ, డిప్యూటీ ఛైర్మన్‌ను పొగిడేందుకు సమయాన్ని వృథా చేశారు. పత్రికా ప్రకటనలతో సానుభూతి చూపిస్తే సమస్యలు పరిష్కారం కావు" అని స్పష్టం చేశారు.

బీసీలను మోసగించిన వ్యక్తి జగన్
బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లను హైకోర్టు వ్యతిరేకిస్తే, దానిపై సుప్రీంకోర్టుకు వెళ్లి జగన్ ఎందుకు పోరాడలేదని పార్థసారథి నిలదీశారు. "జగన్ నిర్వాకం వల్ల 16,800 మంది బీసీలు పదవులు కోల్పోయారు. 1995లోనే చంద్రబాబు ప్రత్యేక చట్టం చేసి బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించారు. నామినేటెడ్ కాంట్రాక్టుల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు ఇస్తానని అసెంబ్లీ సాక్షిగా మాట తప్పిన వ్యక్తి జగన్. నేతి బీరకాయలో నెయ్యి ఎంత నిజమో, జగన్ మాటలు కూడా అంతే. బీసీలపై అంత ప్రేమ ఉంటే ఒక్క బీసీకి అయినా వైస్ ఛాన్సలర్ పదవి ఇచ్చారా? అధికారంలో ఉన్నప్పుడు బీసీల భూములు కొట్టేశారు, వారిని నరికి చంపారు. ఇప్పుడు వారిపై ప్రేమ నటిస్తున్నారు" అని తీవ్రంగా విమర్శించారు.

రాయలసీమకు చేసిందేమీ లేదు
రాయలసీమ ప్రాజెక్టులకు జగన్ తన ఐదేళ్ల పాలనలో ఖర్చు పెట్టింది కేవలం రూ. 2,000 కోట్లు మాత్రమేనని, కానీ కూటమి ప్రభుత్వం రెండేళ్లలోనే రూ. 13,500 కోట్లు ఖర్చు చేసి, మరో రూ. 10,000 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. "సొంత జిల్లా కడపలో స్టీల్ ప్లాంట్‌కు రెండుసార్లు కొబ్బరికాయ కొట్టారు కానీ ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. నేడు కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పోలవరం పనులను జగన్ అటకెక్కించారు. మేము అధికారంలోకి వచ్చాక పనులు పూర్తిచేసి సెప్టెంబర్ 3 నాటికి ఉత్తరాంధ్రకు నీళ్లు ఇస్తున్నాం" అని స్పష్టం చేశారు. మద్యం కేసులో అరెస్టులు కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధిస్తోందని జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
Advertisement
Kolusu Parthasarathy
YS Jagan Mohan Reddy
Andhra Pradesh Politics
BC Reservations
El Nino Impact
Rayalaseema Projects

More Telugu News