అనకాపల్లి పంచధారల కొండలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం: 'నో మైనింగ్ జోన్'గా ప్రకటన
- మైనింగ్ వల్ల పంచధారల కొండకు ముప్పు వాటిల్లుతోందంటూ పెద్ద ఎత్తున అభ్యంతరాలు
- పురాతన క్షేత్రమైన శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి దేవాలయం దెబ్బతింటుందని ఆందోళన
- ఆ ప్రాంతంలో తవ్వకాలు జరపకుండా నిషేధం విధించిన ప్రభుత్వం
పర్యావరణ పరిరక్షణ, చారిత్రక సంపద రక్షణే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. అనకాపల్లి జిల్లాలోని ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాధాన్యత కలిగిన పంచధారల కొండల ప్రాంతాన్ని అధికారికంగా 'నో మైనింగ్ జోన్'గా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ కొండల పరిసరాల్లో ఎలాంటి తవ్వకాలు, క్వారీ పనులకు ఆస్కారం లేకుండా పూర్తి నిషేధం అమలులోకి వచ్చింది.
ఈ ప్రాంతంలో మైనింగ్ తవ్వకాల వల్ల జీవవైవిధ్యంతో పాటు ప్రసిద్ధ పురాతన క్షేత్రమైన శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి దేవాలయానికి, అక్కడి సహజ సిద్ధమైన పుణ్యతీర్థ జలధారలకు తీవ్ర ముప్పు వాటిల్లుతోందని స్థానిక ప్రజలు, పర్యావరణవేత్తల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు, ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రత్యేక విచారణకు ఆదేశించింది. తవ్వకాల వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతినడమే కాకుండా చారిత్రక కట్టడాలకు హాని జరుగుతోందని నిర్ధారించిన అధికారులు మైనింగ్ పనులను అడ్డుకున్నారు.
ప్రకృతి వనరులను కాపాడడంలో భాగంగా ఆ ప్రాంతంలో గతంలో మంజూరు చేసిన సుమారు 2.153 హెక్టార్ల క్వారీ లీజు అనుమతులను ప్రభుత్వం తక్షణమే రద్దు చేసింది. కొండల సహజ రూపురేఖలు, జీవవైవిధ్యం దెబ్బతినకుండా ఉండేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలన నిర్ణయం పట్ల స్థానిక భక్తులు, పర్యావరణ ప్రేమికులు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు.