నేపాల్‌కు సాయం.. గొప్పలు చెప్పుకోవద్దని మీడియాకు శశిథరూర్ హితవు

Shashi Tharoor advises media not to brag about India aid to Nepal
  • నేపాల్‌కు భారత్ సాయంపై గొప్పలు చెప్పుకోవద్దన్న శశిథరూర్
  • 2015 భూకంపం సమయంలో మీడియా ప్రచారం సంబంధాలను దెబ్బతీసిందని వెల్లడి
  • గతంలో నేపాల్‌పై విధించిన ఆర్థిక దిగ్బంధనం 'హిమాలయన్ బ్లండర్' అని వ్యాఖ్య
  • నేపాల్‌ను సమానమైన, సార్వభౌమ దేశంగా గౌరవించాలని సూచన
  • ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయని వెల్లడి
వరదలతో అతలాకుతలమవుతున్న నేపాల్‌కు భారత్ తక్షణ సహాయం అందించడాన్ని కాంగ్రెస్ ఎంపీ, మాజీ దౌత్యవేత్త శశి థరూర్ స్వాగతించారు. అయితే, ఈ సాయం గురించి భారత మీడియా అతిగా ప్రచారం చేస్తూ గొప్పలు చెప్పుకోవద్దని ఆయన హితవు పలికారు. ఖాట్మండూలో నిర్వహించిన ఒక సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పొరుగు దేశంగా కష్టాల్లో ఉన్న నేపాల్‌కు అండగా నిలవడం మన బాధ్యత అని, ప్రభుత్వం మరింత సహాయాన్ని అందిస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

2015లో నేపాల్‌లో తీవ్ర భూకంపం సంభవించినప్పుడు భారత్ భారీగా సాయం చేసిందని, అయితే ఆ సమయంలో కొన్ని మీడియా సంస్థలు వ్యవహరించిన తీరు, చేసిన ప్రచారం ఇరు దేశాల మధ్య సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపిందని శశిథరూర్ గుర్తుచేశారు. "సహాయం పొందుతున్న వారికి ఆ విషయాన్ని పదేపదే గుర్తుచేయడం సరికాదు. ప్రభుత్వం ఎంత సున్నితంగా వ్యవహరిస్తుందో, మీడియా కూడా అంతే బాధ్యతాయుతంగా ఉండాలి" అని ఆయన సూచించారు.

గతంలో నేపాల్‌పై విధించిన అనధికారిక ఆర్థిక దిగ్బంధనాన్ని శశిథరూర్ ఒక భారీ తప్పిదంగా అభివర్ణించారు. కేవలం చారిత్రక, సాంస్కృతిక బంధాల (రోటీ-బేటీ) కోణంలోనే కాకుండా, నేపాల్‌ను ఒక సార్వభౌమ, సమాన హోదా కలిగిన దేశంగా భారత్ గౌరవించాలని ఆయన స్పష్టం చేశారు. అయితే, కొన్నేళ్ల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగ్గా ఉన్నాయని, ఇరు పక్షాల వైఖరి సానుకూలంగా ఉందని శశిథరూర్ అభిప్రాయపడ్డారు. తాజాగా వరదల అనంతరం భారత్ తక్షణమే స్పందించి సాయం అందించడమే దీనికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
Advertisement
Shashi Tharoor
Nepal Floods
India Nepal Relations
Indian Media
Humanitarian Aid
Kathmandu

More Telugu News