ఆంధ్రప్రదేశ్‌కు మరో రెండు ఎయిమ్స్‌ ఇవ్వండి: కేంద్రానికి జనసేన ఎంపీ విజ్ఞప్తి

Lingamaneni Ramesh requests Center to grant two more AIIMS for Andhra Pradesh
  • రాయలసీమ, ఉత్తరాంధ్రలో ఒక్కోటి ఏర్పాటు చేయాలని ప్రతిపాదన
  • మంగళగిరి ఎయిమ్స్‌ను మరింత అభివృద్ధి చేయాలని కోరిన ఎంపీ
  • కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాకు వినతిపత్రం సమర్పణ
ఆంధ్రప్రదేశ్‌కు మరో రెండు అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థలను (ఎయిమ్స్‌) మంజూరు చేయాలని జనసేన పార్టీ రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేశ్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఒక్కోటి చొప్పున వీటిని ఏర్పాటు చేయడంతో పాటు, ప్రస్తుతం మంగళగిరిలో ఉన్న ఎయిమ్స్‌ను మరింత అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు గురువారం ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసి ఆయన వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర విభజన తర్వాత దాదాపు ఐదు కోట్ల జనాభా ఉన్న ఏపీకి, భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఒక్క ఎయిమ్స్ ఏమాత్రం సరిపోదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల ప్రజలు కార్డియాలజీ, క్యాన్సర్, న్యూరాలజీ, అవయవ మార్పిడి, అత్యవసర ట్రామా కేర్ వంటి ప్రత్యేక వైద్య సేవల కోసం వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

గతంలో జమ్ముకశ్మీర్, బిహార్ వంటి రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఒకటి కంటే ఎక్కువ ఎయిమ్స్‌లను మంజూరు చేసిందని, అదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌కు కూడా అవకాశం కల్పించాలని లింగమనేని రమేశ్‌ కోరారు. మంగళగిరి ఎయిమ్స్‌లో సమగ్ర క్యాన్సర్ కేంద్రం, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ ఇన్‌స్టిట్యూట్, న్యూరో సైన్సెస్, అడ్వాన్స్‌డ్ కార్డియాక్ కేర్ సెంటర్‌ వంటి అత్యాధునిక విభాగాలను ఏర్పాటు చేయాలని, అలాగే అదనపు పడకలు, బోధనా సిబ్బందిని కేటాయించాలని విన్నవించారు.
Advertisement
Lingamaneni Ramesh
Janasena Party
AIIMS Andhra Pradesh
JP Nadda
Rayalaseema North Andhra

More Telugu News