వెన్నుపోటు, గొడ్డలివేటుకు జగన్ బ్రాండ్ అంబాసిడర్: మంత్రి కొల్లు రవీంద్ర

Jagan Mohan Reddy is the brand ambassador for backstabbing and axe attacks says Kollu Ravindra
  • హామీలన్నీ ఉల్లంఘించి ప్రజలను, యువతను, రైతులను జగన్ మోసం చేశారని ఆరోపణ
  • కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి పాలన సాగిస్తోందని వెల్లడి
  • జగన్ రెడ్డి కుట్రల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపు
  • డీఎస్సీ, పోలీసు ఉద్యోగాలతో పాటు అనేక హామీలను ఇప్పటికే అమలు చేశామని స్పష్టం
ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేసిన జగన్ ను మించిన వెన్నుపోటుదారుడు మరొకరు లేరని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "వెన్నుపోటుకు, గొడ్డలివేటుకు జగన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్" అని ఆయన అభివర్ణించారు. శనివారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగన్ ఐదేళ్ల పాలనపై నిప్పులు చెరిగారు.

ఎన్నికల్లో గెలిచేందుకు అడ్డగోలు హామీలిచ్చి, అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ తుంగలో తొక్కిన దుర్మార్గుడు జగన్ అని రవీంద్ర విమర్శించారు. సొంత బాబాయి హత్య కేసులో నిందితులకు కొమ్ముకాస్తూ, తోడబుట్టిన చెల్లిపైనే నిందలు వేసిన నీచమైన మనస్తత్వం జగన్‌ది అని ఆరోపించారు. ఆయన ఐదేళ్ల అరాచక పాలన, మోసపూరిత వైఖరిని చూసిన ప్రజలు 'ఈ సైకో మాకొద్దు' అంటూ ఎన్నికల్లో కూటమికి 94 శాతం సీట్లు కట్టబెట్టారని గుర్తుచేశారు. కేవలం 11 సీట్లకే పరిమితమైనా సిగ్గులేకుండా ఇంకా కుట్రలనే నమ్ముకుని, ప్రజాసంక్షేమం కోసం నిబద్ధతతో పనిచేస్తున్న ప్రభుత్వంపై నీచమైన కుతంత్రాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

జగన్ తన పాలనను ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభించారని, సంపూర్ణ మద్యపాన నిషేధం హామీని గాలికి వదిలేసి, కల్తీ బ్రాండ్లు, సొంత కంపెనీల మద్యంతో ప్రజల జేబులు కొల్లగొట్టి తాడేపల్లి ప్యాలెస్ ఖజానా నింపుకున్నారని ఆరోపించారు. ఈ కల్తీ మద్యం కారణంగా రాష్ట్రంలో సుమారు 30 వేల మంది మహిళలు మాంగళ్యాలు కోల్పోయారని, లక్షలాది మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

విద్యుత్ ఛార్జీలను 9 సార్లు పెంచి రూ.32 వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపారని, పీపీఏలు రద్దు చేసి విద్యుత్ సంస్థలకు రూ.1.29 లక్షల కోట్ల నష్టం కలిగించారని విమర్శించారు.

మెగా డీఎస్సీ, ఏటా జాబ్ క్యాలెండర్ అంటూ యువతను దారుణంగా మోసం చేశారని, జగన్ రెడ్డి దగాకోరు మాటల వల్ల గత ఐదేళ్లలో 4100 మంది యువకులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని కొల్లు రవీంద్ర ఆరోపించారు.

'అమ్మఒడి' పథకాన్ని కొందరికే పరిమితం చేసి విద్యార్థులను, జీవో నెం.117తో పేదలకు పాఠశాలలను దూరం చేసి బడుగు బలహీన వర్గాల ప్రజలను వెన్నుపోటు పొడిచారని అన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే ఆ జీవోను రద్దు చేసిందని గుర్తుచేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చెందిన వందలాది సంక్షేమ పథకాలను రద్దు చేసి, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు కుదించి ఆ వర్గాలకు తీరని ద్రోహం చేశారని విమర్శించారు.

అమరావతే రాజధాని అని చెప్పి, గెలిచాక మూడు రాజధానుల નાటకంతో రాష్ట్రాన్ని, రైతులను మోసం చేశారని అన్నారు. పొరుగు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించి రాష్ట్ర రైతాంగానికి తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. ఆస్తిలో వాటా అడిగినందుకు చెల్లిని, ఆమెకు అండగా నిలిచిన కన్నతల్లిని ఇంటి నుంచి గెంటేసిన వ్యక్తి జగన్ అని, ఆయన లాంటి క్రూర మనస్తత్వం ఉన్న వ్యక్తిని రాజకీయంగా సమాధి చేయాలని పిలుపునిచ్చారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తోందని, సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి పాలన సాగిస్తోందని కొల్లు రవీంద్ర తెలిపారు. "సూపర్ సిక్స్" హామీలను అమలు చేస్తూ, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని అన్నారు.

ఇప్పటికే 16,400 టీచర్ పోస్టులు, 6000 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని, 20 లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో పరిశ్రమలను ఆకర్షిస్తున్నామని వివరించారు. విభజన నష్టం కంటే జగన్ పాలనలో జరిగిన నష్టమే ఎక్కువని, ఆయన కుట్రల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి, గొడ్డలి పార్టీని భూస్థాపితం చేయాలని కోరారు.
Go Back to Shorts
YS Jagan Mohan Reddy
Kollu Ravindra
Andhra Pradesh Politics
TDP YSRCP War
AP Liquor Policy
Super Six Schemes

More Telugu News