సినిమాను మించిన సీన్.. చనిపోయిన మహిళను బతికించిన గుంత.. అస‌లేం జ‌రిగిందంటే!

Pothole brings dead woman back to life in a scene beyond cinema
  • ఏలూరులో మ‌హిళ‌ను చనిపోయిందని నిర్ధారించిన వైద్యులు
  • అంబులెన్స్‌లో తరలిస్తుండగా గుంతలో పడ్డ వాహనం
  • కుదుపుతో మహిళలో చలనం.. తిరిగి వచ్చిన ప్రాణం
  • విజయవాడ ఆసుపత్రిలో చికిత్స.. నిలకడగా ఆరోగ్యం
  • మృత్యుంజయురాలిగా నిలిచిన మాజీ స‌ర్పంచ్‌ రామతులసి
సినిమాల్లో మాత్రమే చూసే అద్భుతాలు కొన్నిసార్లు నిజ జీవితంలోనూ జరుగుతాయి. వైద్యులు చనిపోయిందని నిర్ధారించిన ఓ మహిళ, అంబులెన్స్‌లో తరలిస్తుండగా జరిగిన ఓ చిన్న సంఘటనతో మృత్యువును జయించి తిరిగి ప్రాణాలతో బయటపడింది. ఏలూరు జిల్లాలో చోటుచేసుకున్న ఈ వింత ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బంధువులంతా కన్నీరుమున్నీరవుతున్న సమయంలో ఆమె తిరిగి కళ్లు తెరవడం కుటుంబంలో ఆనందాన్ని నింపింది.

వివరాల్లోకి వెళితే.. ఏలూరు జిల్లా కైకలూరు మండలం భుజబలపట్నం మాజీ సర్పంచ్ గురజాల రామతులసి కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. రెండు రోజుల క్రితం ఆమె ఆరోగ్యం విషమించడంతో కుటుంబసభ్యులు ఏలూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తున్నప్పటికీ ఆమె శరీరం స్పందించలేదు. నిన్న‌ తెల్లవారుజామున పరిస్థితి మరింత దిగజారడంతో వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి సీపీఆర్ చేశారు. అయినా ఫలితం లేకపోవడం, పల్స్ పూర్తిగా పడిపోవడంతో ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

దీంతో కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆమె మరణవార్త తెలియగానే బంధువులు, స్థానిక నాయకులు సంతాపం తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. అనంతరం ఆమె మృతదేహాన్ని అంత్యక్రియల కోసం అంబులెన్స్‌లో స్వగ్రామానికి తరలిస్తుండగా ఊహించని సంఘటన జరిగింది. మండవల్లి మండలం పులపర్రు వద్దకు రాగానే అంబులెన్స్‌కు ఓ బైక్ అడ్డురావడంతో డ్రైవర్ దానిని తప్పించబోయి వాహనాన్ని పక్కకు తిప్పాడు. ఈ క్రమంలో అంబులెన్స్ రోడ్డుపై ఉన్న ఓ పెద్ద గుంతలో పడి గట్టిగా కుదుపునకు గురైంది.

ఆ కుదుపు దెబ్బకు రామతులసి శరీరంలో ఒక్కసారిగా చలనం వచ్చింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు షాక్‌కు గురయ్యారు. వెంటనే తేరుకుని దగ్గరలోని మరో ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆమె కొన ఊపిరితో ఉందని, బతకడం కష్టమని చెప్పారు. అయినప్పటికీ ఆశ వదులుకోని కుటుంబసభ్యులు ఆమెను ఏలూరు రిమ్స్‌కు, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. విజయవాడ వైద్యుల చికిత్సతో నిన్న‌ సాయంత్రానికి ఆమె ఆరోగ్యం మెరుగుపడింది. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. చనిపోయిందనుకున్న తమ మనిషి తిరిగి బతకడంతో కుటుంబసభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
Advertisement
Gurajala Ramatulasi
Eluru miracle news
Ambulance pothole incident
Kaikaluru former sarpanch
Dead woman alive Andhra Pradesh
Vijayawada Government Hospital

More Telugu News