చైనా చేతికి అమెరికన్‌ ఓటర్ల వివరాలు.. వైట్‌హౌస్‌ సంచలన ఆరోపణలు

White House alleges China accessed American voter registration details
  • నిఘా పత్రాలు విడుదల చేసిన అమెరికా
  • బహిరంగం కాని సమాచారం కూడా హ్యాకర్ల చేతికి వెళ్లినట్లు వెల్లడి
  • కొనుగోలు ద్వారా సమాచారాన్ని సేకరించి ఉండొచ్చని అనుమానం
  • ఇలాంటి సమాచారం ప్రత్యర్థి దేశాల చేతికి వెళితే తీవ్ర పరిణామాలుంటాయని ఆందోళన
అమెరికా ఎన్నికల భద్రతపై మరోసారి తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దాదాపు 22 కోట్ల మంది అమెరికన్ల ఓటరు నమోదు వివరాలను చైనా లేదా దాని అనుబంధ సైబర్‌ వర్గాలు సేకరించాయని వైట్‌హౌస్‌ సంచలన ఆరోపణలు చేసింది. సాధారణంగా అందుబాటులో లేని సమాచారం కూడా వారి చేతికి వెళ్లినట్లు తెలిపింది.

వైట్‌హౌస్‌ ప్రభుత్వ పారదర్శకత టాస్క్‌ఫోర్స్‌ విడుదల చేసిన ఫ్యాక్ట్‌షీట్‌లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. దీనికి అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్‌ కార్యాలయం, నేషనల్‌ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్‌ఎస్‌ఏ), సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (సీఐఏ), హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం ఆమోదం తెలిపినట్లు పేర్కొంది. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల విదేశీ ఎన్నికల జోక్యానికి సంబంధించిన నిఘా పత్రాలను విడుదల చేయాలని ఆదేశించిన నేపథ్యంలో ఈ ఫ్యాక్ట్‌షీట్‌ను బయటపెట్టింది. చైనా, దాని తరఫున పనిచేసే సైబర్‌ వర్గాలు కొనుగోలు చేయడం, చోరీ చేయడం లేదా హ్యాకింగ్‌ ద్వారా ఓటర్ల సమాచారాన్ని సేకరించాయని ఆరోపించింది.

ఇలాంటి సమాచారం ప్రత్యర్థి దేశాల చేతికి వెళితే తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని అమెరికా నిఘా సంస్థలు హెచ్చరించాయి. ఓటరు వివరాలను మార్చితే కొందరు ఓటు వేయకుండా అడ్డుకునే ప్రమాదం ఉంటుందని తెలిపాయి. పోలింగ్‌ రోజు ఆలస్యం సృష్టించడం వంటి పరిస్థితులు రావచ్చని పేర్కొన్నాయి. అదే సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఓటర్లను ప్రభావితం చేసే చర్యలు కూడా చేపట్టే అవకాశం ఉందని హెచ్చరించాయి.
Advertisement
China
White House
US Election Security
American Voter Data
Cyber Hacking
Foreign Election Interference

More Telugu News