Jagan Mohan Reddy: సింహాచలం ఘటన బాధితులను, మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు కాసేపట్లో విశాఖకు వెళుతున్న జగన్

- సింహాచలం ఆలయం వద్ద గోడ కూలి ఏడుగురు మృతి... పలువురికి గాయాలు
- కేజీహెచ్ ఆసుపత్రికి వెళ్లి బాధితులను, బాధిత కుటుంబాలను పరామర్శించనున్న జగన్
- ఈ ఘటనపై ఇప్పటికే తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన జగన్
వైసీపీ అధినేత జగన్ నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ ఉదయం సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్ద జరిగిన గోడ కూలిన దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. బాధితులను, మృతుల కుటుంబీకులను జగన్ పరామర్శించనున్నారు.
తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి, ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటల సమయానికి వైఎస్ జగన్ విశాఖపట్నం చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. అనంతరం ఆయన నేరుగా కింగ్ జార్జ్ ఆసుపత్రికి (కేజీహెచ్) వెళతారు. అక్కడ, సింహాచలం దుర్ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను, అలాగే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులను కలిసి వారికి తన సానుభూతిని తెలియజేయనున్నారు.
సింహాచలం చందనోత్సవం సందర్భంగా జరిగిన ఈ విషాద ఘటనపై వైఎస్ జగన్ ఇప్పటికే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రూ. 300 టికెట్ క్యూలైన్పై గోడ కూలి భక్తులు మృతి చెందడం అత్యంత బాధాకరమని ఆయన అన్నారు. స్వామి వారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ఇలాంటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం విచారకరమని పేర్కొన్నారు. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, మరణించిన భక్తుల కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఆయన కోరారు.