Advertisement

రైతులకు శుభవార్త.. పీఎం-కిసాన్ పథకం మరో ఐదేళ్లు పొడిగింపు

PM Kisan scheme extended for another five years good news for farmers
  • 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు పథకం కొనసాగింపు
  • ఐదేళ్ల కోసం రూ. 3.15 లక్షల కోట్ల కేటాయింపునకు ఆమోదం
  • ఏటా రూ. 6,000 ఆర్థిక సాయం యథాతథంగా కొనసాగింపు
కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగించాలని నిర్ణయించింది. శుక్రవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేశారు.

ఈ పొడిగింపుతో పీఎం-కిసాన్ పథకం 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు అమల్లో ఉండనుంది. ఇందుకోసం రాబోయే ఐదేళ్లకు గానూ రూ. 3,15,614 కోట్లను కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ. 6,000 ఆర్థిక సాయం అందుతున్న విషయం విదితమే. ఈ మొత్తాన్ని మూడు సమాన వాయిదాల్లో, అంటే ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ. 2,000 చొప్పున ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా నేరుగా ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తారు.

రైతులకు కనీస ఆదాయ భరోసా కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరి 24న ఈ పథకాన్ని ప్రారంభించింది. కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం వివరాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక మద్దతు నిరంతరాయంగా కొనసాగనుంది.

మరోవైపు, రాబోయే ఐదేళ్లలో 5,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా 'ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన'కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ. 5,070 కోట్లను కేటాయించింది. అలాగే, ఖేల్ ఇండియా పథకానికి రూ. 29 వేల కోట్లు, సముద్ర మంథన్ ప్రాజెక్టుకు రూ. 84 వేల కోట్లు, సొరంగాల నిర్మాణం కోసం రూ. 9,779 కోట్లు కేటాయిస్తూ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.
Advertisement
PM Kisan
PM Kisan extension 2030
Union Cabinet decisions
Ashwini Vaishnaw
PM Surya Sarovar Yojana

More Telugu News