Vangapudi Anita: ఏపీలో జరుగుతున్న అరెస్టులపై హోం మంత్రి అనిత ఏం చెప్పారంటే..!

Andhra Pradesh Home Minister Anitas Statement on Recent Arrests

  • అరెస్టులు పారదర్శకంగానే జరుగుతున్నాయన్న అనిత
  • వైసీపీ హయాంలో హింస పరాకాష్ఠకు చేరిందని మండిపాటు
  • విచారణకు అందరూ సహకరించాలని హితవు

మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్‌పై రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో కొందరు అధికారులు అప్పటి రాజకీయ నాయకులను, ముఖ్యమంత్రిని మెప్పించడం కోసం నిబంధనలకు విరుద్ధంగా పనిచేసి ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె వ్యాఖ్యానించారు. కాదంబరి జెత్వానీ అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జరిగిన విచారణలో లభించిన ఆధారాలతోనే చట్ట ప్రకారం ఆంజనేయులును అరెస్ట్ చేశారని, ఇందులో ఎలాంటి కక్ష సాధింపు లేదని ఆమె స్పష్టం చేశారు.

గతంలో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ, తమ ప్రభుత్వంలో ఏ అధికారికి అలాంటి పరిస్థితి రాలేదని మంత్రి అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము ఎన్నో కేసులు, ఇబ్బందులు ఎదుర్కొన్నామని, కానీ ఏ అధికారిపైనా కక్ష సాధించలేదని తెలిపారు. 

వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారులు ఎందుకు చట్టం ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుందో ఆ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. తప్పులు చేయించి, ఇప్పుడు అధికారులు ఇబ్బందుల్లో ఉంటే కనీసం పక్కన నిలబడకుండా వారి వ్యక్తిత్వం గురించి మాట్లాడటం సరికాదని విమర్శించారు.

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపుల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని మంత్రి అనిత అన్నారు. ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన విధ్వంసం ఐదేళ్లపాటు కొనసాగిందని, అచ్చెన్నాయుడు నుంచి పట్టాభి వరకు ఎందరో టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించారని, చివరికి డీజీపీ కార్యాలయం పక్కనే ఉన్న టీడీపీ కార్యాలయంపై దాడి జరిగినా సమర్థించుకున్నారని ఆమె గుర్తు చేశారు. పాత్రికేయులు, సోషల్ మీడియా కార్యకర్తలు, అమరావతి మహిళలను కూడా సీఐడీ ద్వారా వేధించారని అనిత ఆరోపించారు. 

ప్రజా సమస్యలపై పోరాటం చేయకుండా, ఎక్కడైనా శవం కనిపిస్తే జగన్ రోడ్లపైకి వస్తున్నారని ఆమె విమర్శించారు. తమ ప్రభుత్వం శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుబడి ఉందని, చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఎవరైనా కఠిన చర్యలు తప్పవని హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. 

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో బాధితుడి కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు పునర్విచారణకు ఆదేశాలు ఇచ్చామని, చట్టం తనపని తాను చేసుకుపోతుందని మంత్రి అనిత పేర్కొన్నారు. ఆధారాలు లభించిన తర్వాతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని, విచారణకు అందరూ సహకరించాలని ఆమె కోరారు.

Vangapudi Anita
Andhra Pradesh Home Minister
AP arrests
Jagan Mohan Reddy
YSRCP
SIT investigation
Subrahmanyam murder case
Jatwani case
liquor scam
political violence
  • Loading...

More Telugu News