Vasamsetti Subhash: రఘురామకృష్ణరాజుపై జగన్ కక్షకు కారణమేంటో బయటపెట్టిన మంత్రి వాసంశెట్టి

- ‘సార్’ అని సంబోధించలేదనే రఘురామపై జగన్ కక్ష పెంచుకున్నారన్న మంత్రి వాసంశెట్టి
- డార్క్ రూములో ఉండి నలుగురితోనే జగన్ వ్యవస్థలను నడిపించారని విమర్శ
- ఎమ్మెల్సీ పదవి కోసం జగన్కు సాష్టాంగ నమస్కారం చేయమన్నారన్న వాసంశెట్టి
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ నాయకులకే కాదని, సొంత పార్టీ నేతలకు కూడా ఆయన చుక్కలు చూపించారని కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ అన్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం గండిగుంటలో ఆదివారం నిర్వహించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పుట్టిన రోజు వేడుకలో మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా పలు విషయాలను వెల్లడించారు. వైసీపీలో తాను పదేళ్లపాటు క్రియాశీలంగా ఉన్నానని, తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పారని గుర్తు చేసుకున్నారు. తాను కనుక అప్పుడు ఆ పదవిని తీసుకుని ఉంటే ప్రజలు రాళ్లతో కొట్టేవారని అన్నారు. ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పిన తర్వాత ధనుంజయ్రెడ్డి దగ్గరకు వెళితే జగన్కు సాష్టాంగ నమస్కారం పెట్టమన్నారని అన్నారు. ఆ మాట వినడంతోనే షాకయ్యానని చెప్పారు. మీ జిల్లాకు చెందిన మంత్రి వేణు ఇలానే చేస్తారని ఆయన చెప్పడంతో ఆశ్చర్యపోయానని గుర్తు చేసుకున్నారు.
జగన్ను ‘సార్’ అని సంబోధించలేదని, ఆయన ముందు కాలిపై కాలు వేసుకొని దర్జాగా కూర్చున్నారన్న కారణంతో నాడు ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజుపై జగన్ కక్ష గట్టారని మంత్రి వాసంశెట్టి తెలిపారు. జగన్ బయటకు రాకుండా డార్క్ రూములో కూర్చొని నలుగురితోనే వ్యవస్థలను నడిపించారని పేర్కొన్నారు. మళ్లీ తానే సీఎం అవుతానని జగన్ భావించారని, ఆయన తీరుతో విసిగిపోయిన సొంత పార్టీ నాయకులే ఓటుతో బుద్ధి చెప్పారని అన్నారు. ఎన్నికల ఫలితాలు తారుమారు కావడంతో ఏం చేయాలో తోచక కూటమి నాయకులపై అసత్య ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. బుడమేరు వరదల సమయంలో కోటి రూపాయల సాయం చేస్తామని చెప్పి ఇప్పటికీ చేయలేదని విమర్శించారు. కోట్ల రూపాయలు సంపాదించినా జగన్లో సేవా గుణం లేదని వాసంశెట్టి విమర్శించారు.