YS Jaganmohan Reddy: విశాఖ మేయర్ పీఠం కూటమి కైవసం.. జగన్ రియాక్షన్ ఇదే!

Visakhapatnam Mayor Post Goes to Coalition Jagans Strong Reaction

  • విశాఖ మేయర్ పై పెట్టిన అవిశ్వాసంలో కూటమి ఘన విజయం
  • మేయర్ పదవి కోల్పోయిన వైసీపీ
  • ఎక్స్ వేదికగా స్పందించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్
  • చంద్రబాబు దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం అంటూ మండిపాటు

విశాఖ వైసీపీకి కూటమి నేతలు షాక్ ఇచ్చారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)ను వైసీపీ కోల్పోయింది. జీవీఎంసీ వైసీపీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారిపై కూటమి నేతలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో విశాఖ మేయర్ పీఠం కూటమి వశమైంది. దీనిపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ, గూండాయిజం చేస్తూ, ప్రలోభాలు, బెదిరింపులకు దిగి విశాఖపట్నం మేయర్‌గా ఉన్న బీసీ మహిళను పదవి నుంచి దించేయడం, మీరు చేస్తున్న దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం అని దుయ్యబట్టారు.

ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం 98 డివిజన్లు ఉన్న విశాఖపట్నం కార్పొరేషన్‌లో వైఎస్ఆర్ సీపీ గుర్తుపై పోటీచేసి 58 స్థానాలను మా పార్టీ వాళ్లు గెలుచుకోగా, టీడీపీ కేవలం 30 సీట్లు మాత్రమే గెలిచిందన్నారు. మరి మీకు మేయర్ పదవి ఏ రకంగా వస్తుంది? బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ యాదవ కులానికి చెందిన మహిళను మేం మేయర్ పదవిలో కూర్చోబెడితే, మీరు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, కోట్లాది రూపాయలతో ప్రలోభపెట్టి, పోలీసులను దుర్వినియోగం చేస్తూ, బెదిరిస్తూ, అప్పటికీ లొంగకపోతే మా పార్టీ కార్పొరేటర్లు విడిది చేసిన హోటల్‌పై మీ నాయకులతోనూ, పోలీసులతోనూ దాడులు చేయించారని అన్నారు. దీనికి సంబంధించిన సీసీ కెమెరా వీడియోలు ఇప్పుడు ప్రజల ముందే ఉన్నాయి. మరి దీన్ని ప్రజాస్వామ్యం అంటారా? అవిశ్వాస ప్రక్రియ స్వేచ్ఛగా జరిగిందని అనుకోవాలా? ఇది అధికార దుర్వినియోగం కాదా? అని జగన్ ప్రశ్నించారు.

మరో ఏడాది గడిస్తే ఇప్పుడున్న కౌన్సిల్ పదవీకాలం పూర్తవుతుందని తెలిసీ, మళ్లీ ఎన్నికలు వస్తాయని తెలిసి కూడా, ప్రజలకు ఫలానా మంచి చేశానని చెప్పి ఓట్లు అడిగే ధైర్యం చంద్రబాబుకు, కూటమికి లేదని పేర్కొన్నారు. అందుకే అన్యాయమైన రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని సమాధి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి అప్రజాస్వామిక విధానాలకు దేవుడు, ప్రజలే గుణపాఠం చెప్తారని అన్నారు.

ఇన్ని ప్రలోభాలు పెట్టినా, బెదిరింపులకు గురిచేసినా తలొగ్గక పార్టీవైపు, ప్రజల వైపు నీతి, నిజాయితీగా నిలబడి చిత్తశుద్ధి చాటుకున్న వైఎస్ఆర్ సీపీ కార్పొరేటర్లను, అలాగే వామపక్షాలకు చెందిన కార్పొరేటర్లను అభినందిస్తున్నానన్నారు. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో తమకు అధికారం లేకపోయినా అధికార దుర్వినియోగం, కండ బలంతో వాటిని చేజిక్కించుకోవడానికి చంద్రబాబు చేస్తున్న కుటిల ప్రయత్నాలను దీటుగా ఎదుర్కొని నిలబడుతున్న తమ పార్టీ నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు మరోసారి హ్యాట్సాఫ్ చెప్తున్నానని పేర్కొన్నారు. 

YS Jaganmohan Reddy
Chandrababu Naidu
Visakhapatnam Mayor
GVM Corporation
No Confidence Motion
Andhra Pradesh Politics
TDP
YSRCP
Coalition Politics
Municipal Elections
  • Loading...

More Telugu News