ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్: ఫైనల్లో తీవ్రంగా నిరాశపరిచిన ఇండియా-ఏ... విజేత పాకిస్థాన్-ఏ
- శ్రీలంక వేదికగా ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్
- ఫైనల్లో ఇండియా-ఏ వర్సెస్ పాకిస్థాన్-ఏ
- 128 పరుగుల భారీ తేడాతో ఓడిన యువ భారత్
- 353 పరుగుల లక్ష్యఛేదనలో 224 పరుగులకే ఆలౌట్
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్... పాకిస్థాన్ కు బ్యాటింగ్ అప్పగించింది. తయ్యబ్ తాహిర్ (108) విధ్వంసక సెంచరీతో మెరవగా, పాక్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 352 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్యఛేదనలో భారత్ కు ఓ మోస్తరు శుభారంభం లభించినా, మిడిలార్డర్ వైఫల్యంతో ఓటమి తప్పలేదు.
ఓపెనర్లు అభిషేక్ శర్మ 61, సాయి సుదర్శన్ 29 పరుగులు చేశారు. దూకుడుగా ఆడుతున్న అభిషేక్ అవుటవడంతో ఇండియా-ఏ పతనం ఆరంభమైంది. అక్కడ్నించి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన యువ జట్టు ఓటమిని తప్పించుకోలేకపోయింది. కెప్టెన్ యశ్ ధూల్ 39 చేశాడు.
పాకిస్థాన్-ఏ జట్టు బౌలర్లలో సూఫియాన్ ముఖీమ్ 3, అర్షద్ ఇక్బాల్ 2, మెహ్రాన్ ముంతాజ్ 2, మహ్మద్ వాసిం జూనియర్ 2 వికెట్లతో ఇండియా-ఏ బ్యాటింగ్ లైనప్ ను దెబ్బతీశారు.
మ్యాచ్ లో చివరి వికెట్ తీశాక పాకిస్థాన్-ఏ ఆటగాళ్ల సంబరాలు మామూలు స్థాయిలో లేవు. మైదానంలో సింహనాదాలు చేస్తూ, కోచ్ ను పైకెత్తి ఫుల్ జోష్ ను ప్రదర్శించారు.