Budda Venkanna: మీకు ఎంపీ గారు షోకాజ్ నోటీసు పంపినట్టు ఉన్నారు.. ఆ లేఖకి సమాధానం చెప్పే దమ్ము లేదా?: విజయసాయిని ప్రశ్నించిన బుద్ధా వెంకన్న

  • రఘురామకృష్ణంరాజుకు షోకాజ్ నోటీసు ఇచ్చిన విజయసాయి
  • ప్రాంతీయ పార్టీకి జాతీయ కార్యదర్శి అంటూ కృష్ణంరాజు ఎద్దేవా
  • విజయసాయిని టార్గెట్ చేసిన బుద్ధా వెంకన్న
Budda Venkanna targets Vijayasai Reddy

పార్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి షోకాజ్ నోటీసును జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ షోకాజ్ నోటీసుపై స్పందిస్తూ విజయసాయికి రఘురామకృష్ణంరాజు ఇచ్చిన సమాధానం వైసీపీలో కలకలం రేపుతోంది.

ప్రాంతీయ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి అంటూ విజయసాయిని ఆయన సంబోధించారు. ఓ రాష్ట్ర పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి ఉంటాడా? అని ప్రశ్నించారు. లెటర్ హెడ్స్ మీద వైఎస్సార్ అని ఉపయోగించడం కుదరదని, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అని మాత్రమే ఉపయోగించాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసిందని అన్నారు. పార్టీ తరఫున ఓ క్రమశిక్షణ సంఘం ఉందని, దానికి ఎన్నికల సంఘం గుర్తింపు ఉందని భావించినప్పుడే మీరు పంపిన షోకాజ్ నోటీసులపై తాను స్పందిస్తానని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డిని ఉద్దేశించి టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ట్విట్టర్ ద్వారా సెటైర్లు వేశారు. 'ట్విట్టర్ లో ఉడుత ఊపులు ఆపండి విజయసాయిరెడ్డిగారూ' అంటూ దెప్పిపొడిచారు. 'ప్రాంతీయ పార్టీకి జాతీయ కార్యదర్శి అయిన మీకు యువజన శ్రామిక రైతు పార్టీ ఎంపీ గారు షోకాజ్ నోటీసు పంపినట్టు ఉన్నారు. ఆ లేఖకి సమాధానం చెప్పే దమ్ము లేదా? అబ్బా సాయిరాం...' అంటూ ట్వీట్ చేశారు.

More Telugu News