Nara Lokesh: 108లో ప్రజాధనం ఎందుకు వృథా అయ్యిందో చెప్పలేక టీడీపీ నేతలను అరెస్ట్ చేయాలనుకుంటున్నారు: నారా లోకేశ్ ఫైర్

  • 108లో స్కాం జరిగిందంటున్న టీడీపీ నేతలు
  • స్కాం చేసినవాళ్లను వదిలేస్తున్నారని లోకేశ్ ఆగ్రహం
  • రాజారెడ్డి రాజ్యాంగం ప్రత్యేకత అంటూ వ్యంగ్యం
Nara Lokesh take a dig at YSRCP leaders on ambulance scam

రాష్ట్రంలో 108 అంబులెన్స్ ల నిర్వహణకు సంబంధించి వందల కోట్ల స్కాం జరిగిందని, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన వియ్యంకుడు, అల్లుడికి దోచిపెడుతున్నారని టీడీపీ నేత పట్టాభిరామ్ నిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలకు సంబంధించిన కథనాలు ఇవాళ పత్రికల్లో వచ్చాయి. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు.

108 అంబులెన్స్ ల నిర్వహణలో ప్రజాధనం ఎందుకు వృథా అయ్యిందో చెప్పలేకపోతున్న వైసీపీ ప్రభుత్వం, ఆ స్కాంను కప్పిపుచ్చేందుకు టీడీపీ నాయకుల్ని అరెస్ట్ చేయాలనుకుంటోందని ఆరోపించారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు, అక్రమ అరెస్ట్ లతో వైసీపీ నేతల భూ దందాలు, ఇసుక అక్రమాలు, గనులు, మద్యం మాఫియా ఆగడాలు బయటికి రాకుండా చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారని, కానీ ఆయన ప్రయత్నం ఫలించదని లోకేశ్ స్పష్టం చేశారు.

స్కాం చేసినవాళ్లను వదిలేస్తూ, స్కాంను బయటపెట్టిన వాళ్లను జైల్లో వేయడమే రాజారెడ్డి రాజ్యాంగం ప్రత్యేకత అంటూ విమర్శించారు. రివర్స్ టెండరింగ్ లో భారీగా మిగిల్చాం అంటూ బిల్డప్ ఇస్తున్న జగన్ సర్కారు 108 స్కాంపై ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు.

More Telugu News