ప్రధాని మోదీ సభ వేదిక వద్ద కలకలం.. నకిలీ పీఎంఓ ఐడీ, గన్‌తో ఇద్దరు అదుపులోకి!

ప్రధాని మోదీ సభ వేదిక వద్ద కలకలం.. నకిలీ పీఎంఓ ఐడీ, గన్‌తో ఇద్దరు అదుపులోకి!

Narendra Modi Mumbai event security breach two detained with gun
  • ఒకరి వద్ద నకిలీ పీఎంఓ ఐడీ కార్డు, మరొకరి వద్ద గన్ గుర్తింపు
  • ముంబైలోని అంబానీ కల్చరల్ సెంటర్‌లో ఘటన
  • భద్రతా డ్రిల్ నిర్వహిస్తుండగా పట్టుకున్న పోలీసులు
  • గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో పాల్గొననున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్న కార్యక్రమ వేదిక వద్ద కలకలం రేగింది. నకిలీ గుర్తింపు కార్డు, తుపాకీతో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామంతో భద్రతా వర్గాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఉన్న నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (ఎన్ఎంఏసీసీ) వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

ప్రధాని మోదీ మంగళవారం సాయంత్రం జరగనున్న 'గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ (జీఎఫ్ఎఫ్) 2026' ప్రారంభోత్సవానికి హాజరుకావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి పోలీసులు భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తూ డ్రిల్ నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని విచారించగా, 24 ఏళ్ల రోహన్ పరేఖ్ అనే వ్యక్తి తనను తాను ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) అధికారిగా పరిచయం చేసుకున్నాడు. అతని వద్ద ఉన్న గుర్తింపు కార్డును పరిశీలించగా అది నకిలీదని తేలింది. అదే సమయంలో అతని గన్ మన్ వద్ద ఉన్న తుపాకీని కూడా పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

వెంటనే వారిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు, తదుపరి దర్యాప్తు నిమిత్తం ఈ కేసును ముంబై క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించారు. ప్రస్తుతం అధికారులు వారిని ముమ్మరంగా విచారిస్తున్నారు. వారి మొబైల్ ఫోన్లు, గుర్తింపు పత్రాలు, ఇతర సామాగ్రిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఆరోపణలు నిర్ధారణ అయిన అనంతరం వారిపై తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన నేపథ్యంలో ప్రధాని పర్యటనకు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
Advertisement
Narendra Modi
Mumbai Police
PM Security Breach
Fake PMO Official
Rohan Parekh
Global Fintech Fest

More Telugu News