స్థానిక ఎన్నికల్లో కూటమి శ్రేణులు సమన్వయంతో పని చేయాలి: పురందేశ్వరి
- కూటమి ఎన్నికల్లో కూటమి ఐక్యంగా బరిలోకి దిగుతుందన్న పురందేశ్వరి
- 2024 ఫలితాలను స్థానిక ఎన్నికల్లో కూడా పునరావృతం చేయాలని పిలుపు
- కేంద్రం సహకారంతో అమరావతి, పోలవరం పనులు వేగవంతమయ్యాయని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఎన్డీఏ కూటమి (టీడీపీ-బీజేపీ-జనసేన) ఐక్యంగానే బరిలోకి దిగుతుందని బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి స్పష్టం చేశారు. రాజమండ్రిలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన 'మన ఊరు – మన జెండా' కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాజానగరం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిలతో కలిసి ఆమె ప్రారంభించారు.
కేంద్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారంతో రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతమయ్యాయని, రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత లభిస్తోందని తెలిపారు. దేశ, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం అత్యంత కీలకమని... స్థానిక సమరంలో కూటమి జెండాను ఎగురవేసేందుకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.