బెంగళూరు విమానంలో కలకలం.. టిష్యూ పేపర్‌పై 'బాంబు' అని రాసిన నోట్

Commotion on Bengaluru flight as bomb note found on tissue paper
  • లక్నో-బెంగళూరు ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు
  • ల్యాండింగ్‌కు ముందు టాయిలెట్‌లో బాంబు నోట్‌ గుర్తింపు
  • విమానం సేఫ్ ల్యాండింగ్... ప్రయాణికులను దించిన అధికారులు
  • తనిఖీల్లో ఉత్తిదేనని తేల్చిన బాంబ్ స్క్వాడ్
లక్నో నుంచి బెంగళూరుకు వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. విమానం ల్యాండ్ కావడానికి మరికొద్ది నిమిషాల ముందు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు. చివరికి అది కేవలం వట్టి బెదిరింపు అని తేలడంతో ప్రయాణికులు, విమాన సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

బుధవారం ఉదయం ఇండిగో విమానం (6E231) బెంగళూరులో ల్యాండ్ అయ్యేందుకు సిద్ధమవుతుండగా, విమానంలోని టాయిలెట్ వద్ద ఉన్న ఒక టిష్యూ పేపర్‌పై 'బాంబు' అని రాసి ఉండటాన్ని క్యాబిన్ సిబ్బంది గుర్తించారు. వెంటనే వారు పైలట్‌ను అప్రమత్తం చేయగా, ఆయన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ (ఏటీసీ) అధికారులకు సమాచారం అందించారు.

ఉదయం 9:40 గంటల సమయంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన వెంటనే, ముందుజాగ్రత్త చర్యగా దానిని విమానాశ్రయంలోని ఒక ప్రత్యేక ప్రదేశానికి తరలించారు. ప్రయాణికులను, సిబ్బందిని సురక్షితంగా కిందకు దించిన అనంతరం, సీఐఎస్ఎఫ్ బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో కలిసి విమానం అంతటా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.

క్యాబిన్, సీట్లు, ఓవర్‌హెడ్ కంపార్ట్‌మెంట్లు, టాయిలెట్లతో సహా విమానంలోని అన్ని భాగాల్లో సోదాలు నిర్వహించినప్పటికీ, ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులు లభించలేదు. దీంతో అది ఆకతాయిల పనేనని నిర్ధారించుకున్న అధికారులు, విమానాన్ని తిరిగి కార్యకలాపాలకు అనుమతించారు. ఆ నోట్ ఎవరు రాశారనే అంశంపై అధికారులు ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నారు.
Advertisement
IndiGo
Bengaluru Airport
Lucknow to Bengaluru flight
Bomb threat
Flight 6E231
Tissue paper bomb note

More Telugu News