మల్లు భట్టివిక్రమార్కతో భేటీ.. అందుకే కలిశానన్న రాజగోపాల్ రెడ్డి

Komatireddy Rajagopal Reddy meets Mallu Bhatti Vikramarka and reveals the reason
  • భట్టి విక్రమార్కతో భేటీపై క్లారిటీ ఇచ్చిన రాజగోపాల్ రెడ్డి
  • నియోజకవర్గ అభివృద్ధి, నిధుల కోసమే కలిశానని వెల్లడి
  • తనది స్వచ్ఛమైన కాంగ్రెస్ రక్తమని వ్యాఖ్య
  • కొండా సురేఖ వివాదంపై అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అని స్పష్టీకరణ
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో జరిగిన భేటీపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. బుధవారం ప్రజాభవన్‌లో ఉపముఖ్యమంత్రిని కలిసిన ఆయన, కేవలం నియోజకవర్గ అభివృద్ధి, నిధుల కేటాయింపులపై చర్చించేందుకే ఈ భేటీ జరిగిందని వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి, తాను కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్న సీనియర్ నాయకుడినని పేర్కొన్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తాను తీవ్రంగా వ్యతిరేకించానని, 2018 ఎన్నికల్లో ఎంతోమంది సీనియర్లు ఓటమి పాలైనప్పటికీ మునుగోడు ప్రజలు తన వెంటే నిలిచారని ఆయన గుర్తుచేశారు. తన వ్యాఖ్యలు పార్టీ బలోపేతం కోసమే తప్ప, ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించేందుకు కాదని స్పష్టం చేశారు. "మాది స్వచ్ఛమైన కాంగ్రెస్ రక్తం. ఎన్నికల సమయంలో కొత్తగా వచ్చిన వారికి టికెట్లు కేటాయించారు. అయితే, పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత నాయకత్వంపై ఉంది" అని ఆయన వ్యాఖ్యానించారు.

మంత్రి కొండా సురేఖకు సంబంధించిన వివాదంపై స్పందిస్తూ, ఈ విషయంలో పార్టీ అధిష్ఠానం నిర్ణయమే అంతిమమని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పందించారని, క్రమశిక్షణ సంఘం కూడా సంబంధిత వ్యాఖ్యలపై పీసీసీకి నివేదిక సమర్పించిందని తెలిపారు. తనపై విమర్శలు చేసే వారు ముందుగా ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించిన ఆయన, తాను ఎల్లప్పుడూ పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉంటానని వెల్లడించారు. రాహుల్ గాంధీని దేశ ప్రధానిని చేయడమే తమ ప్రధాన లక్ష్యమని రాజగోపాల్ రెడ్డి పునరుద్ఘాటించారు.
Advertisement
Komatireddy Rajagopal Reddy
Mallu Bhatti Vikramarka
Munugode MLA
Telangana Congress
Praja Bhavan

More Telugu News