నేపాల్‌ వరదలతో బయటపడ్డ చైనా ‘కపట ప్రేమ’!

China hypocritical love exposed by Nepal floods
  • నేపాల్‌-చైనా సరిహద్దులో భారీ వరద బీభత్సం
  • టిబెట్‌ వైపు నుంచి ఒక్కసారిగా వచ్చిన వరద నీరు
  • ముందస్తు హెచ్చరిక ఇవ్వలేదంటూ చైనాపై విమర్శలు
  • నేపాలీ జర్నలిస్టు పరశురామ్‌ కఫ్లే తీవ్ర వ్యాఖ్యలు
  • ‘ఏకపక్ష ప్రేమ’కు నేపాల్‌ ఎందుకు మూల్యం చెల్లించాలని ప్రశ్న
నేపాల్‌-చైనా సరిహద్దులో ఒక్కసారిగా విరుచుకుపడిన వరదలు భారీ నష్టాన్ని మిగిల్చాయి. నేపాల్ లో పలు గ్రామాలు నీట మునిగాయి. వాహనాలు కొట్టుకుపోయాయి. 8 మంది మరణించారు. మౌలిక వసతులు దెబ్బతిన్నాయి. ఈ విపత్తు వేళ ముందస్తు హెచ్చరిక ఇవ్వలేదంటూ చైనాపై నేపాల్‌లో విమర్శలు మొదలయ్యాయి. చైనాతో సన్నిహిత సంబంధాలున్నా.. కష్టకాలంలో ముందస్తు సమాచారం ఇవ్వకపోవడమేంటని ఓ నేపాలీ జర్నలిస్టు ప్రశ్నించారు.

నేపాల్‌ విదేశీ వ్యవహారాలు, వ్యూహాత్మక అంశాలపై రాసే జర్నలిస్టు పరశురామ్‌ కఫ్లే ఈ అంశంపై ‘ఎక్స్‌’లో స్పందించారు. పొరుగు దేశం తమను తీవ్రంగా దెబ్బతీసిందని విమర్శించారు. భారీ విపత్తుపై ముందస్తు హెచ్చరిక ఇచ్చి ఉంటే ప్రాణనష్టం తగ్గించగలిగేవారమని పేర్కొన్నారు.

చైనా భూభాగం నుంచి పదేపదే సంక్షోభాలు ఎదురవుతున్నా.. ఆ దేశ భద్రతా ఆందోళనలను నేపాల్‌ పట్టించుకుంటూనే ఉందని కఫ్లే అన్నారు. మరి ‘ఏకపక్ష ప్రేమ’కు నేపాల్‌ మాత్రమే ఎందుకు మూల్యం చెల్లించుకోవాలని ప్రశ్నించారు. అవసరమైనా, అవసరం లేకపోయినా చైనా ఆందోళనలను తాము పరిగణనలోకి తీసుకుంటున్నామని చెప్పారు.

నేపాల్‌లోని రసువా జిల్లాలో భారీ వరద బీభత్సం సృష్టించింది. టిబెట్‌ వైపు నుంచి ఒక్కసారిగా వచ్చిన వరద నీరు ఉదయం 9 గంటల సమయంలో భోటే కోషి నదిలోకి చేరింది. దీంతో టిమురే, స్యాఫ్రు బెసి ప్రాంతాల్లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.

గ్రామాలు, వాహనాలు, మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆస్తి, ప్రాణ నష్టాలపై ఇంకా పూర్తిగా అంచనా వేయాల్సి ఉంది. సహాయక చర్యలను వేగవంతం చేయాలని నేపాల్‌ ప్రధాని బాలేంద్ర షా అధికారులను ఆదేశించారు. నేపాల్‌ ఆర్మీ, సాయుధ పోలీసు బలగాలు, నేపాల్‌ పోలీసులు రంగంలోకి దిగి గాలింపు, సహాయక చర్యలు చేపట్టారు.
Advertisement
China
Nepal Floods
Bhote Koshi River
Tibet Water Release
Parshuram Kafle
Nepal China Border

More Telugu News