ఈ రాత్రే ఇరాన్‌పై తీవ్ర దాడులు: ట్రంప్ సంచలన ప్రకటన

Donald Trump announces severe attacks on Iran tonight
  • ఇరాన్ కీలక ఆయిల్ కేంద్రమైన ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామని వెల్లడి
  • ఇప్పటికే ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న సైనిక ఘర్షణలు
  • దాడుల హెచ్చరికల మధ్యే కొనసాగుతున్న దౌత్యపరమైన చర్చలు
అమెరికా - ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి పతాకస్థాయికి చేరాయి. ఇరాన్‌పై ఈ రాత్రే భారీస్థాయిలో దాడులు చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. సమీప భవిష్యత్తులో ఇరాన్‌కు చెందిన కీలక చమురు క్షేత్రాలను, ముఖ్యంగా ఖర్గ్ ద్వీపాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

గురువారం తన ట్రూత్ సోషల్ ఖాతా ద్వారా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. "ఈ రాత్రే అమెరికా బలగాలు ఇరాన్‌పై అత్యంత తీవ్రమైన దాడులు చేయనున్నాయి. త్వరలోనే ఖర్గ్ ద్వీపంతో పాటు ఇతర చమురు మౌలిక సదుపాయాల కేంద్రాలను స్వాధీనం చేసుకుంటాం. వారి చమురు, గ్యాస్ మార్కెట్లపై పూర్తి నియంత్రణ సాధిస్తాం" అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.

ఇప్పటికే ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇటీవల ఇరాన్‌కు చెందిన గగనతల రక్షణ, నిఘా వ్యవస్థలపై అమెరికా దాడులు నిర్వహించింది. మరోవైపు, తమ అపాచీ హెలికాప్టర్‌ను ఇరాన్ కూల్చివేసిందని అమెరికా ఆరోపిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ చేసిన తాజా హెచ్చరికలు అంతర్జాతీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

పర్షియన్ గల్ఫ్‌లో ఉన్న ఖర్గ్ ద్వీపం, ఇరాన్ చమురు ఎగుమతులకు ప్రధాన కేంద్రం. ఆ దేశం నుంచి జరిగే ముడి చమురు ఎగుమతుల్లో సుమారు 90 శాతం ఇక్కడి నుంచే సాగుతాయి. ఈ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ ప్రకటించడం ప్రపంచ దేశాల్లో ఆందోళన కలిగిస్తోంది. సైనిక చర్యల హెచ్చరికల కొనసాగుతున్నప్పటికీ, ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు కూడా జరుగుతున్నాయని, అయితే అవి మందకొడిగా సాగుతున్నాయని తెలుస్తోంది.
Go Back to Shorts
Donald Trump
Iran
Kharg Island
US Iran conflict
Iran oil fields
Truth Social

More Telugu News