రూ.100 కోట్లకు పైగా ఆదాయం చూపుతున్న వారి సంఖ్యలో భారీ పెరుగుదల!

Huge increase in number of people showing income over 100 crore
  • 576కు పెరిగిన రూ.100 కోట్ల ఆదాయం ఉన్నవాళ్లు 
  • ఐదేళ్లలో దాదాపు 300 శాతం వృద్ధి
  • లోక్‌సభలో కేంద్రం వెల్లడించిన గణాంకాలు
  • ‘బిలియనీర్‌’కు చట్టంలో నిర్వచనం లేదన్న స్పష్టత
  • ఆదాయ అసమానత తగ్గిందన్న కేంద్రం
దేశంలో ఏడాదికి రూ.100 కోట్లకు పైగా ఆదాయం ప్రకటిస్తున్న పన్ను చెల్లింపుదారుల సంఖ్య గత ఐదేళ్లలో గణనీయంగా పెరిగింది. ఈ సంఖ్య దాదాపు నాలుగు రెట్లు పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు వెల్లడించారు.

2025-26 అసెస్‌మెంట్‌ సంవత్సరంలో రూ.100 కోట్లకు మించి వార్షిక ఆదాయం ప్రకటించిన వారి సంఖ్య 576కు చేరిందని తెలిపారు. 2021-22లో ఈ సంఖ్య 142 మాత్రమే ఉండేదని చెప్పారు. అంటే ఐదేళ్ల వ్యవధిలో దాదాపు 300 శాతం పెరుగుదల నమోదైనట్లు వివరించారు. 2022-23లో ఈ సంఖ్య 301కు చేరగా, 2023-24లో స్వల్పంగా తగ్గి 284గా నమోదైంది. ఆ తర్వాత 2024-25లో 415కు పెరిగి, 2025-26లో 576కు చేరింది.

ఆదాయపు పన్ను చట్టం-2025లో ‘బిలియనీర్‌’ అనే పదానికి ప్రత్యేక నిర్వచనం లేదని కేంద్రం స్పష్టం చేసింది. అందువల్ల ఆదాయపు పన్ను రిటర్నుల్లో రూ.100 కోట్లకు పైగా ఆదాయం ప్రకటించిన వ్యక్తుల వివరాలను మాత్రమే అందించినట్లు పేర్కొంది. ఈ గణాంకాలు పన్ను రిటర్నుల ఆధారంగా సేకరించినవేనని వెల్లడించింది.

దేశంలో ఆదాయ అసమానతలపై అడిగిన ప్రశ్నకు కూడా కేంద్రం సమాధానం ఇచ్చింది. ‘హౌస్‌హోల్డ్‌ కన్సంప్షన్‌ ఎక్స్‌పెండిచర్‌ సర్వే’ (2023-24) ప్రకారం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆదాయ అసమానత తగ్గినట్లు తెలిపింది. అలాగే 15 ఏళ్లు పైబడిన వారి నిరుద్యోగ రేటు 2023-24లో 3.1 శాతానికి తగ్గిందని వెల్లడించింది. ఉపాధి కల్పన, ప్రగతిశీల పన్ను విధానం, ఆరోగ్యం, విద్య, గృహ నిర్మాణం, గ్రామీణాభివృద్ధిపై ప్రభుత్వ వ్యయం పెంచడం ద్వారా సమ్మిళిత ఆర్థిక వృద్ధికి కృషి చేస్తున్నట్లు కేంద్రం వివరించింది.
Advertisement
Indian Taxpayers
Income Tax Department
Pankaj Chaudhary
High Income Earners
Indian Economy
Income Tax Returns

More Telugu News