రాష్ట్రంలో విద్యా సంస్కరణల పర్వం ముగిసింది... ఇక ఫలితాలపై దృష్టి సారించాలి: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh says education reforms phase over focus on results now
  • పునాదిపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో మంత్రి లోకేశ్ ఆకస్మిక తనిఖీ
  • మీకు మార్కులు రాకపోతే సీఎం నా మార్కులు తగ్గిస్తారని విద్యార్థులతో వ్యాఖ్య
  • మౌలిక వసతులున్నా అభ్యసన సామర్థ్యాలు తక్కువగా ఉండటంపై అసంతృప్తి
  • విద్యా సంస్కరణలు పూర్తయ్యాయని, ఇక ఫలితాలపై దృష్టి పెట్టాలని ఆదేశం
  • మధ్యాహ్న భోజనం నాణ్యత, విద్యాకానుకలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్న వైనం
రాష్ట్రంలో విద్యా రంగంలో సంస్కరణల పర్వం ముగిసిందని, ఇకపై కేవలం ఫలితాలపైనే పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారులను స్పష్టంగా ఆదేశించారు. విద్యార్థులకు మంచి మార్కులు రాకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు తన పనితీరుకు మార్కులు తగ్గిస్తారని, కాబట్టి విద్యార్థులంతా బాగా చదివి మంచి ఫలితాలు సాధించాలని ఆయన ఉత్సాహపరిచారు. సోమవారం కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంత్రి లోకేశ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని వసతులు, విద్యా ప్రమాణాలపై సుదీర్ఘంగా ఆరా తీశారు.

పదో తరగతి ఫలితాలపై ప్రత్యేక దృష్టి

తనిఖీలో భాగంగా మంత్రి లోకేశ్ నేరుగా పదో తరగతి 'ఏ' సెక్షన్ గదిలోకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "గతేడాది ఈ పాఠశాలలో పదో తరగతి ఉత్తీర్ణత శాతం కేవలం 67 శాతంగా ఉంది. ఇది రాష్ట్ర సగటు కంటే 11 శాతం తక్కువ. మీ సీనియర్ల కంటే మీరు బాగా చదివి మెరుగైన ఫలితాలు సాధించాలి. పదో తరగతి, ఇంటర్మీడియట్ అనేవి విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైన దశలు. నా జీవితంలో కూడా ఆ సమయంలోనే మార్పు వచ్చింది. ఇప్పుడు కష్టపడి మంచి మార్కులు తెచ్చుకుంటేనే మీ భవిష్యత్తు బంగారుమయమవుతుంది" అని విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు.

చిక్కీకే ఎక్కువ మంది ఓటు

అనంతరం పాఠశాలలో అమలవుతున్న 'సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్' అందజేత, మధ్యాహ్న భోజనం నాణ్యత గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. భోజనం బాగుందని విద్యార్థులు బదులిచ్చారు. ప్రజాప్రభుత్వంలో మధ్యాహ్న భోజనానికి నాణ్యమైన బియ్యం (ఫైన్ రైస్) అందిస్తున్నామని తెలిపారు. "మీలో రాగిజావ ఎంతమందికి ఇష్టం, చిక్కీ ఎంతమందికి ఇష్టం?" అని మంత్రి సరదాగా ప్రశ్నించగా, ఎక్కువ మంది చిక్కీకే ఓటేశారు. 

పాఠశాలలో మౌలిక సదుపాయాలకు 2.76 రేటింగ్ ఉన్నప్పటికీ, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు (లెర్నింగ్ అవుట్‌కమ్స్) కేవలం 0.9 శాతం రేటింగ్‌తో చాలా తక్కువగా ఉండటంపై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. "అద్భుతమైన వసతులు, మంచి ఉపాధ్యాయులు ఉన్నా ఫలితాలు ఎందుకు రావడం లేదు? పట్టణానికి దగ్గరగా ఉన్న పాఠశాలలో ఈ పరిస్థితి ఆమోదయోగ్యం కాదు" అని అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, అనుమతి లేకుండా ఉపాధ్యాయులు గైర్హాజరు కావడాన్ని సహించేది లేదని హెచ్చరించారు.

సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ రెండూ ముఖ్యమే

విద్యావ్యవస్థ విజయవంతం కావాలంటే సాఫ్ట్‌వేర్ (బోధన), హార్డ్‌వేర్ (వసతులు) రెండూ ముఖ్యమేనని మంత్రి అభిప్రాయపడ్డారు. ఇంటర్మీడియట్‌లో ఉపాధి అవకాశాలు కల్పించే వొకేషనల్ కోర్సుల ల్యాబ్‌లపై దృష్టి సారించాలని సూచించారు. పాఠశాలలో ఉన్న ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, పాఠశాల అభివృద్ధిలో పూర్వ విద్యార్థులను కూడా భాగస్వాములను చేయాలని కోరారు. 340 మంది విద్యార్థులున్న ఈ పాఠశాలలో ఫలితాల్లో గణనీయమైన మార్పు కనిపించాలని ఆదేశించారు. అనంతరం 9వ తరగతి విద్యార్థులతో మాట్లాడి, వారికి ఆటోగ్రాఫ్‌లు ఇచ్చి ఉత్సాహపరిచారు. 
Advertisement
Nara Lokesh
Andhra Pradesh Education Reforms
AP School Inspection
Punadipadu High School Visit
AP 10th Class Results
Education Minister Nara Lokesh

More Telugu News