Advertisement

హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ కుదేలైందనే ప్రచారంలో నిజం లేదు: పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Ponguleti Srinivasa Reddy clarifies Hyderabad real estate growth remains strong
  • ఉద్దేశపూర్వకంగా కొందరు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారన్న పొంగులేటి
  • కాంగ్రెస్ పాలనలో 20 శాతం వరకు రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందిందని వెల్లడి
  • హైదరాబాద్ అభివృద్ధికి ప్రణాళికాబద్ధమైన చర్యలు చేపడుతున్నామన్న మంత్రి

హైదరాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందంటూ కొంతమంది ఉద్దేశపూర్వకంగా గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని, ఇందులో ఏమాత్రం నిజం లేదని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ వద్ద ఉన్న స్పష్టమైన గణాంకాలే ఇందుకు నిదర్శనమని అన్నారు. గత రెండున్నరేళ్ల ప్రజా ప్రభుత్వ పాలనలో 15 నుంచి 20 శాతం రియల్ ఎస్టేట్ అభివృద్ధి జరిగిందని, ప్లాట్ల విక్రయాలు ఏకంగా 40 శాతం వరకు పెరిగాయని వెల్లడించారు. గత పదేళ్ల పాలనతో పోలిస్తే ఈ రెండున్నరేళ్లలోనే రెసిడెన్షియల్ మార్కెట్ విశేషంగా పుంజుకుందని తెలిపారు.


2004-2014 మధ్య నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రుల దూరదృష్టి వల్లే ఓఆర్‌ఆర్, అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ సెక్టార్ అభివృద్ధితో హైదరాబాద్ రోల్ మోడల్‌గా మారి ప్రపంచ దృష్టిని ఆకర్షించిందని మంత్రి గుర్తుచేశారు. ఇటీవలి దావోస్ పర్యటనలో కూడా పలువురు అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు నగరంలో పెట్టుబడులకు ఆసక్తి చూపారని తెలిపారు. 


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో హైదరాబాద్ అభివృద్ధికి ప్రణాళికాబద్ధమైన చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా రూ.7 వేల కోట్లతో మూసీ ప్రక్షాళన, సుందరీకరణ ప్రాజెక్టును చేపడుతున్నామని... తొలి విడత 28 కిలోమీటర్ల పరిధికి వారం పది రోజుల్లో టెండర్లు పిలవనున్నట్లు వెల్లడించారు. అలాగే పాతబస్తీని కలుపుతూ రెండో విడతగా రూ.24 వేల కోట్ల వ్యయంతో 76 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణ, ఆర్‌ఆర్‌ఆర్ నుంచి ఓఆర్‌ఆర్‌లను కలుపుతూ రేడియల్ రోడ్ల నిర్మాణ ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయని తెలిపారు.


రాష్ట్రంలో భూముల భద్రత, భరోసా కోసం 'భూభారతి' చట్టాన్ని అందుబాటులోకి తెచ్చామని, దానిలోని చిన్నపాటి సాఫ్ట్‌వేర్ సమస్యలను మరో 15-20 రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే జీహెచ్‌ఎంసీ/కోర్ పరిధిలోని పేదల కోసం తొలి విడతగా లక్ష ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. రియల్ ఎస్టేట్ ప్రతినిధుల కోరిక మేరకు అనుమతుల ప్రక్రియలో 'ఫాస్ట్ ట్రాక్' సౌకర్యాన్ని కల్పించేందుకు ప్రయత్నిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.

Advertisement
Ponguleti Srinivasa Reddy
Hyderabad Real Estate
Telangana Real Estate Growth
Musi River Project
Hyderabad Metro Expansion
Bhoo Bharati Act

More Telugu News