డీఎస్సీ ఆరోపణలపై జగన్‌తో బహిరంగ చర్చకు నేను సిద్ధం: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh ready for open debate with Jagan on DSC allegations
  • వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్, భూకుంభకోణాలపైనా చర్చిద్దామని లోకేశ్ సవాల్
  • జగన్‌కు ‘క్రెడిట్ చోర్ డిజార్డర్’ జబ్బు ఉందని ఎద్దేవా
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో నూరుశాతం విజయమే లక్ష్యమన్న లోకేశ్
  • కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేడర్‌కు పిలుపు
డీఎస్సీ నియామకాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆ పార్టీ అధినేత జగన్‌కు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సవాల్ విసిరారు. డీఎస్సీ అంశంపై జగన్‌తో బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, దమ్ముంటే చర్చకు రావాలని ఆయన అన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న లోకేశ్, జగన్ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. "డీఎస్సీపై గొడ్డలి పార్టీ అధినేత చేస్తున్న ఆరోపణలపై చర్చకు నేను సిద్ధం. ఈ చర్చ కేవలం డీఎస్సీకే పరిమితం కాదు. వైసీపీ ఐదేళ్ల పాలనలో జరిగిన లిక్కర్, భూ కుంభకోణాలపై కూడా చర్చిద్దాం" అని సవాల్ విసిరారు. 2 లక్షల టీచర్ పోస్టులు భర్తీ చేసిన ఘనత టీడీపీది అయితే, ఐదేళ్లలో ఒక్క పోస్టు కూడా భర్తీ చేయని నీచ చరిత్ర జగన్‌ది అని లోకేశ్ ధ్వజమెత్తారు. "వర్టికల్, హారిజంటల్ రిజర్వేషన్లను అమలుచేసి అత్యంత పారదర్శకంగా డిఎస్సీ నిర్వహిస్తే బురద జల్లుతున్నారు. మేము 150 రోజుల్లో అత్యంత పారదర్శకంగా డీఎస్సీ నిర్వహిస్తే, దాన్ని అడ్డుకోవాలని 150 కేసులు వేశారు. ఆ కేసులన్నీ కోర్టులు కొట్టివేయడమే మా చిత్తశుద్ధికి నిదర్శనం" అని ఆయన స్పష్టం చేశారు.

తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అభివృద్ధి, సంక్షేమం అయితే.. గొడ్డలి పార్టీ విధానం విధ్వంసం, బూతులు, బాబాయ్‌ను గొడ్డలితో లేపేయడం, తల్లి, చెల్లిని ఇంటి నుంచి తరిమేయడం అని లోకేశ్ తీవ్రంగా విమర్శించారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్‌కు ‘క్రెడిట్ చోర్ డిజార్డర్’ (సీసీడీ) అనే జబ్బు ఉందని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి తీసుకొచ్చిన ఆర్సెలర్ మిట్టల్, గూగుల్, రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి పరిశ్రమలను తానే తెచ్చానని జగన్ చెప్పుకోవడం ఆయనకున్న జబ్బు లక్షణమని అన్నారు.

ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెడ్ల బండిలా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని లోకేశ్ తెలిపారు. ప్రభుత్వ విజయాలను, వైసీపీ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నూటికి నూరు శాతం స్థానాలు గెలిచేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.
Advertisement
Nara Lokesh
Jagan Mohan Reddy
AP DSC Recruitment
Andhra Pradesh Education Minister
TDP vs YSRCP
AP Teacher Jobs

More Telugu News