Somireddy Chandramohan Reddy: ఏపీ లిక్కర్ స్కామ్ లోకల్ కాదు... ఇంటర్నేషనల్: ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

- ఏపీ లిక్కర్ స్కామ్ రూ. 3200 కోట్లు కాదు.. రూ.10 వేల కోట్లకు పైనే అన్న ఎమ్మెల్యే
- అధికారిక సేల్ తగ్గించి అక్రమంగా అమ్మేసి వేల కోట్లు దోచేశారని ఆరోపణ
- అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
వైసీపీ పాలనలో ఇంటర్నేషనల్ స్థాయిలో లిక్కర్ స్కామ్ జరిగిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ అన్నారు. రూ.1.30 లక్షల కోట్ల విలువైన నగదు లావాదేవీలు జరగడం దేశంలో ఎక్కడైనా చూశామా అని ఆయన ప్రశ్నించారు. అక్రమంగా దోచేయడం కోసమే మద్యం వ్యాపారంలో డిజిటల్ పేమెంట్లను జగన్ సర్కార్ అనుమతించలేదని ఆరోపించారు.
ఓ వైపు ప్రధానమంత్రి మోదీ డిజిటల్ ఇండియా అంటుంటే జగన్ రెడ్డి మాత్రం క్యాష్ ఆంధ్రప్రదేశ్గా మార్చారని విమర్శించారు. ప్రస్తుతం ఈ కుంభకోణంపై విచారణ సాగిస్తున్న సిట్ మరింత లోతుగా వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ రూ. 3200 కోట్లకు పరిమితం కాలేదని, రూ.10 వేల కోట్లకు పైనే అని అన్నారు. వేల కోట్ల అక్రమాలు, మనీ లాండరింగ్ జరిగితే ఈడీ, సీబీఐ ఎందుకు రంగంలో దిగడం లేదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశ్నించారు.
రూ.1.30 లక్షల కోట్ల క్యాష్ ట్రాన్సాక్షన్ జరుగుతుంటే గత ఐదేళ్లు ఈడీ, సీబీఐ ఈ కుంభకోణంపై ఎందుకు దృష్టి సారించలేదన్నారు. 1989లో రూ.60 కోట్ల విలువైన బోఫోర్స్ కుంభకోణం రాజీవ్ గాంధీ కొంపముంచిందని, 2014లో 2జీ స్కాం మన్మోహన్ సింగ్ను దెబ్బకొట్టిందని గుర్తు చేశారు. ఈ రెండు స్కాములు కాంగ్రెస్ పార్టీకి జాతీయ హోదా కోల్పోయే పరిస్థితి తెచ్చాయన్నారు. ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ ఆషామాషీ కేసు కాదని తెలిపారు.
కరోనా సమయంలో 2020 మార్చి 23న లాక్ డౌన్ విధించారు... మే 4న మద్యం దుకాణాలను రీ ఓపెనింగ్ చేశారు... ఆ 42 రోజులు మాత్రమే మద్యం విక్రయాలు ఆగాయని, కానీ లక్షల క్రేట్ల మద్యం విక్రయాలు తగ్గిపోయినట్లు లెక్క చూపించారని ఎమ్మెల్యే మండిపడ్డారు. జగన్ రెడ్డి పర్యవేక్షణలో నడిచిన కసిరెడ్డి అండ్ టీం ఎక్సైజ్ డిపార్టుమెంటులోని మద్యం డిపోలకు వెళ్లకుండా, స్కానింగ్ కాకుండా డిస్టిలరీల నుంచి నేరుగా దుకాణాలకు స్టాక్ తరలించి అక్రమంగా అమ్మేసుకున్నారని ఆరోపించారు.
మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుటుంబానికి చెందిన మెక్ డోవెల్ డిస్టిలరీ మూసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. అడిగినంత కమీషన్లు ఇవ్వలేదని నేషనల్, ఇంటర్నేషనల్ బ్రాండ్ల డిస్టిలరీలను అడ్డంగా మూసేశారని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల నుంచి 3 బాటిల్స్ తీసుకునే వెసులుబాటును కూడా తొక్కేశారని, తామిచ్చిన మద్యమే తాగాలని నియంతలా వ్యవహరించారని... జగన్ రెడ్డి అండ్ బ్యాచ్ కు డబ్బుపై ఉన్న వ్యామోహంతోనే ఇది జరిగిందని ఎమ్మెల్యే సోమిరెడ్డి అన్నారు.
ఐఎస్ఐ గుర్తింపు పొందిన చెన్నైలోని ప్రముఖ ఎస్.జీ.ఎస్ లేబరేటరీ జగన్ ప్రభుత్వం విక్రయించిన సొంత మద్యం బ్రాండ్లపై సంచలన విషయాలను బయటపెట్టిందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. వైసీపీ ప్రత్యేకంగా ప్రోత్సహించిన ఆంధ్రా గోల్డ్, 9సీ హార్సెస్, సిల్వర్ స్ట్రైప్ విస్కీలలో ప్రమాదకరమైన పైరోగలాల్, ఐసోపులరిక్ యాసిడ్, డైఇథనాల్ టాలెట్ ఉన్నాయని తేల్చిందన్నారు. ఇవి తాగితే శరీరంలోని అవయవాలు దెబ్బతిని ప్రాణాలు కోల్పోతారని స్పష్టంగా నివేదికలు ఉన్నాయని తెలిపారు.
ఏపీలో కల్తీ మద్యం తాగి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వేల మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షల మంది మంచాన పడ్డారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఓట్లతో సీఎంగా ఎన్నికైన వ్యక్తి వారి జేబుల్లోని డబ్బును లాక్కోవడమే గాక వారి ప్రాణాలను తీసేయడం దుర్మార్గమన్నారు.
కసిరెడ్డి అండ్ బ్యాచ్ మద్యం వ్యాపారాన్ని తమ చేతుల్లోకి తీసుకుందని, డిస్టలరీలను తమ గుప్పెట్లో పెట్టుకుని నాసిరకమైన మద్యం తయారు చేయించిందని ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆరోపించారు. బ్రాండ్ ను బట్టి క్రేట్(48 బాటిల్స్) కు రూ.150 నుంచి రూ.600 చొప్పున కమీషన్ వసూలు చేశారని, అనఫిషియల్ సేల్ తో ఒక్కో క్రేట్ కు రూ.10 వేల వరకు ఆర్జించారని తెలిపారు.
నడిబజారులో జరిగిన ఈ స్కామ్ ప్రత్యక్షంగా కనిపిస్తోంది.. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఈడీ, సీబీఐలను రంగంలోకి దించాలని ఆయన కోరారు. రూ.1000 లంచం తీసుకున్న ప్రభుత్వ ఉద్యోగిని ఏసీబీ అరెస్ట్ చేసి జైలుకు పంపుతుందని, వేల కోట్లు దోచేసి ప్రజల ప్రాణాలు తీసేసిన వారికి ఏ శిక్ష వేయాలని ప్రశ్నించారు.
క్యాష్ ట్రాన్సాక్షన్ కరెక్ట్ అని, ఈ మందు తాగినందున ఎవరూ చనిపోలేదు అని వైసీపీలోని పెద్ద నాయకులు, జగన్ రెడ్డి రైట్లు, లెఫ్టులు ఎవరైనా చెప్పగలరా అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి సవాల్ చేశారు. మధ్యలో లక్షల క్రేట్ల మద్యం సేల్ ఎందుకు తగ్గిపోయిందో సమాధానం చెబుతారా అని ప్రశ్నించారు. మద్యపాన నిషేధం అమలు చేస్తానని చెప్పి కల్తీ మద్యం పోసి ప్రాణాలు తీయడం క్షమించరాని నేరం అన్నారు.