Rain: కొలంబోలో మళ్లీ వర్షం... భారత్-పాక్ మ్యాచ్ కొనసాగింపుపై అనిశ్చితి

It is raining again in Colombo as uncertainty looms over India and Pakistan Asia Cup match
  • ఆసియా కప్ సూపర్-4లో భారత్, పాక్ పోరు
  • నిన్న వర్షంతో నిలిచిపోయిన మ్యాచ్
  • నేడు రిజర్వ్ డేలో ఆట కొనసాగించాలని నిర్ణయం
  • దోబూచులాడుతున్న వరుణుడు... మైదానాన్ని కవర్లతో కప్పేసిన సిబ్బంది 
చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు ఎక్కడ తలపడినా ఆద్యంతం రసవత్తరంగా ఉంటుంది. ఈ ఏడాది ఆసియా కప్ లో భారత్, పాక్ జట్లు రెండుసార్లు తలపడే అవకాశం రావడంతో అభిమానులు ఎంతో ఉత్సాహపడ్డారు. కానీ వారి ఉత్సాహంపై వరుణుడు నీళ్లు చల్లుతున్నాడు. 

ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య ఆసియా కప్ గ్రూప్ మ్యాచ్ వర్షార్పణం కాగా... నిన్నటి సూపర్-4 మ్యాచ్ కూడా వాన దెబ్బకు గురైంది. ఆ మ్యాచ్ కు నేడు రిజర్వ్ డే కాగా, నిన్న నిలిచిపోయిన మ్యాచ్ ను ఇవాళ కొనసాగించాలని నిర్ణయించారు. 

కానీ శ్రీలంక రాజధాని కొలంబోలో ఇవాళ కూడా వర్షం పడుతోంది. దాంతో దాయాదుల మ్యాచ్ కు వేదికపైన ప్రేమదాస స్టేడియం చిత్తడిగా మారింది. మధ్యలో ఓసారి వర్షం ఆగిపోవడంతో సిబ్బంది కవర్లు తొలగించడంతో మ్యాచ్ మొదలవుతుందన్న ఆశలు మొలకెత్తాయి. అయితే ఆ ఆనందం కాసేపే అయింది. మళ్లీ వర్షం మొదలవడంతో మైదానాన్ని పూర్తిగా కవర్లతో కప్పేశారు. 

షెడ్యూల్ ప్రకారం ఈ మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ఆరంభం కావాల్సి ఉండగా, అంపైర్లు మైదానాన్ని పరిశీలించిన తర్వాత ఆట కొనసాగింపుపై నిర్ణయం తీసుకోనున్నారు.
Rain
Team India
Pakistan
Asia Cup
Colombo
Sri Lanka

More Telugu News