దాయాదుల పోరుకు మళ్లీ వాన దెబ్బ... రేపు రిజర్వ్ డేలో భారత్, పాక్ మ్యాచ్ కొనసాగింపు

Team India and Pakistan match shifts into reserve day
  • శ్రీలంకలో ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్
  • కొలంబోలో వర్షం
  • నిలిచిపోయిన భారత్, పాక్ మ్యాచ్
  • నేటి మ్యాచ్ కు రేపు రిజర్వ్ డే ఏర్పాటు చేసిన నిర్వాహకులు
ఆసియా కప్ లో టీమిండియా మ్యాచ్ అంటే చాలు... వర్షం గ్యారెంటీ అనే పరిస్థితి నెలకొంది. మొన్న టీమిండియా-పాకిస్థాన్ మ్యాచ్ ను ఫలితం తేలకుండానే ముగించేసిన వరుణుడు... ఇవాళ సూపర్-4 దశలోనూ తడాఖా చూపించాడు. 

శ్రీలంక రాజధాని కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో టీమిండియా-పాకిస్థాన్ మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది. ఈ మ్యాచ్ లో పాక్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దాంతో భారత్ మొదట బ్యాటింగ్ చేపట్టింది. అయితే 24.1 ఓవర్ల వద్ద మొదలైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో మ్యాచ్ ను ఇవాళ్టికి నిలిపివేశారు. 

ఈ మ్యాచ్ కు రిజర్వ్ డే ఉండడంతో, రేపు (సెప్టెంబరు 11) మ్యాచ్ ను కొనసాగించనున్నారు. మ్యాచ్ ఎన్ని ఓవర్ల వద్ద ఆగిపోయిందో, అక్కడ్నించే కొనసాగిస్తారు. 

ఇవాళ వర్షం వల్ల మ్యాచ్ నిలిచిపోయే సమయానికి భారత్ 2 వికెట్లకు 147 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్ (17 బ్యాటింగ్), విరాట్ కోహ్లీ (8 బ్యాటింగ్) ఉన్నారు. అంతకుముందు, ఓపెనర్లు రోహిత్ శర్మ (56), శుభ్ మాన్ గిల్ (58) తొలి వికెట్ కు 121 పరుగులు జోడించి పటిష్టమైన పునాది వేశారు. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్, షహీన్ అఫ్రిది చెరో వికెట్ తీశారు.
Go Back to Shorts
Team India
Pakistan
Reserve Day
Asia Cup

More Telugu News