Shamshabad: అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ఈ-బోర్డింగ్.. తొలి విమానాశ్రయంగా శంషాబాద్ ఆర్‌జీఐఏకు గుర్తింపు

  • భారత విమానయాన రంగంలో ఇదో మైలురాయి
  • విమానాశ్రయంలో ప్రయాణికుల ఎదురుచూపులకు చెక్
  • దేశీయ ప్రయాణికుల కోసం 2015లో అందుబాటులోకి వచ్చిన సేవలు
Shamshabad RGIA Introduced E boarding facility

శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఏ) మరో ఘనత సాధించింది. అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ఈ-బోర్డింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫలితంగా ఈ సౌలభ్యాన్ని తీసుకొచ్చిన తొలి విమానాశ్రయంగా రికార్డులకెక్కింది. భారత విమానయాన రంగంలో ఇదో గొప్ప మైలురాయి అని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ సౌకర్యం వల్ల కొవిడ్ మహమ్మారి నుంచి ప్రయాణికులకు భద్రతతోపాటు విమానాశ్రయంలో ప్రయాణికులు వేచి ఉండే సమయం కూడా తగ్గుతుందన్నారు.

ఇక, ఈ-బోర్డింగ్ సదుపాయాన్ని పొందిన తొలి ఎయిర్‌లైన్స్‌గా ఇండిగో రికార్డులకెక్కింది. ప్రస్తుతం ఎంపిక చేసిన అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో మాత్రమే ఈ సదుపాయం అందుబాటులోకి రాగా, ఈ నెల 2న ఇండిగో విమానంలో హైదరాబాద్ నుంచి షార్జా వెళ్లిన ప్రయాణికులు ఈ-బోర్డింగ్ సేవలను అందుకున్నట్టు తెలిపారు. త్వరలోనే ఇతర అంతర్జాతీయ షెడ్యూల్డ్ విమాన సర్వీసుల్లోనూ ఈ సేవలను ప్రారంభిస్తామన్నారు. కాగా, దేశీయ విమాన ప్రయాణికులకు డిసెంబరు 2015లో ఈ-బోర్డింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

More Telugu News