'ఈ20' పోస్టులపై గడ్కరీ ఆగ్రహం.. హైకోర్టులో దావాకు సిద్ధం

Nitin Gadkari sues Meta and influencers for fake E20 ethanol claims
  • 'ఈ20' సోషల్‌ మీడియా పోస్టులపై హైకోర్టుకు వెళ్లిన గడ్కరీ
  • 'ఈ20'తో గడ్కరీ కుటుంబానికి లాభమంటూ ప్రచారం
  • మెటా సహా పలువురిపై సివిల్‌ సూట్‌కు అనుమతి
  • డీప్‌ఫేక్‌, తప్పుడు ప్రచారంపై అభ్యంతరం
  • ఇదే అంశంపై నాగ్‌పూర్‌లో ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌
  • నలుగురు ఇన్‌ఫ్లుయెన్సర్ల పేర్లు కేసులో నమోదు
తన పేరును ఈ20 ఇథనాల్‌ కార్యక్రమంతో ముడిపెడుతూ సోషల్ మీడియాలో ప్రచారమైన పోస్టులు, డీప్‌ఫేక్‌ వీడియోలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ న్యాయపోరాటానికి దిగారు. తనతో పాటు కుటుంబ సభ్యులు ఈ20 విధానం వల్ల లబ్ధి పొందినట్లు తప్పుడు ప్రచారం చేశారని ఆరోపిస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై మెటాతో పాటు ఇతర సోషల్ మీడియా వేదికలు, గుర్తుతెలియని వ్యక్తులపై సివిల్‌ దావా వేయడానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది.

ఈ20 ఇథనాల్‌ కార్యక్రమం వల్ల తన కుటుంబం లాభపడిందంటూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరిగిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. వాస్తవానికి ఇథనాల్‌ మిశ్రమ ఇంధన విధానాన్ని కేంద్ర పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ అమలు చేస్తోందని వివరించారు. ఈ పోస్టులు, డీప్‌ఫేక్‌ కంటెంట్‌ ముంబయిలో కూడా అందుబాటులో ఉండటంతో బాంబే హైకోర్టుకు ఈ కేసును విచారించే అధికారం ఉందని గడ్కరీ తరఫు న్యాయవాది వాదించారు. ఈ వాదనలు విన్న జస్టిస్‌ అభయ్‌ అహుజా.. సివిల్‌ సూట్‌ దాఖలు చేసేందుకు అనుమతి మంజూరు చేశారు.

ఈ పరిణామానికి రెండు వారాల ముందు నాగ్‌పూర్‌లోనూ ఇదే అంశంపై కేసు నమోదైంది. ఈ20 కార్యక్రమానికి సంబంధించి కేంద్ర మంత్రిపై తప్పుడు సమాచారం ప్రచారం చేశారనే ఆరోపణలతో నలుగురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. వారిలో యూట్యూబర్‌, రాజకీయ నాయకుడు మనీష్‌ కశ్యప్‌తో పాటు ‘దేశీ బాయ్స్‌’ పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా, హర్షిత్‌ రాఠీ పేర్లు ఉన్నాయి.

ఈ20 ఇంధన విధానంపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. 20 శాతం ఇథనాల్‌, 80 శాతం పెట్రోల్‌తో కూడిన ఈ ఇంధనం అనుకూల వాహనాలకు సురక్షితమేనని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే పాత వాహనాల పనితీరుపై ప్రభావం పడే అవకాశం ఉందంటూ కొందరు వాహనదారులు, ఆటోమొబైల్‌ నిపుణులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Nitin Gadkari
E20 Ethanol Policy
Bombay High Court
Deepfake Videos
Social Media Defamation
Manish Kashyap

More Telugu News