European Union: చైనా సహా 15 దేశాలకు తెరచుకున్న ఈయూ సరిహద్దులు... అమెరికాకు మాత్రం నో ఎంట్రీ!

  • ప్రజల రాకపోకలకు అనుమతి
  • అమెరికాలో వ్యాపిస్తూనే ఉన్న కరోనా
  • పలు చిన్న దేశాల ప్రజలకు కూడా అనుమతి
EU Open Borders for 15 Countries and Not for USA

కరోనా వైరస్ విజృంభణ ప్రారంభమైన తరువాత మూసుకుపోయిన యూరోపియన్ యూనియన్ సరిహద్దులు తిరిగి తెరచుకున్నాయి. జూలై 1 నుంచి 15 దేశాలవాసులు వచ్చి వెళ్లేందుకు అనుమతిస్తున్నట్టు ఈయూ ప్రకటించింది. ఈ జాబితాలో చైనా కూడా ఉండటం గమనార్హం. ఇదే సమయంలో యూరప్ దేశాలకు అత్యంత కీలకమైన అమెరికా నుంచి మాత్రం ప్రజల రాకపోకలను ఈయూ అనుమతించలేదు. కరోనా మహమ్మారి అమెరికాలో ఇప్పటికీ ఉద్ధృతంగా వ్యాపిస్తూ ఉండటమే ఇందుకు కారణమని ఈయూ పేర్కొంది.

ప్రతి రెండు వారాలకూ ఈ జాబితాను సవరిస్తుంటామని, చైనా సైతం ఇదే విధానాన్ని అవలంబించనుందని ఈయూ ఓ ప్రకటనలో పేర్కొంది. యూఎస్ కు పొరుగు రాష్ట్రమైన కెనడా సహా, జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఉరుగ్వే తదితర దేశాలకు చెందినవారు ఏ విధమైన ఆంక్షలు లేకుండా యూరప్ దేశాల్లో పర్యటించవచ్చని, అయితే, వారికి తుది అనుమతులు తప్పనిసరని పేర్కొంది. అల్జీరియా, జార్జియా, జపాన్, మాంటెనీగ్రో, మొరాకో, రువాండా, సెర్బియా, సౌత్ కొరియా, థాయ్ ల్యాండ్, ట్యునీషియా దేశాల వారికి కూడా ప్రయాణాలకు అనుమతి లభించింది.

మార్చి మూడో వారం నుంచి అత్యవసర పనుల నిమిత్తం మినహా మిగతా అన్ని రకాలైన ప్రయాణాలనూ ఈయూ నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే, సభ్య దేశాల నడుమ, దేశాల సరిహద్దులు ఆయా దేశాల నిర్ణయానుసారం తెరచుకోవచ్చని ఈయూ పేర్కొంది. మహమ్మారి విస్తరిస్తే, యూనియన్ ను నిందించవద్దని కూడా సూచించింది. 

More Telugu News