Amanchi: చిన్న కేసులకు కూడా సీబీఐ విచారణా?: వైసీపీ నేత ఆమంచి తీవ్ర వ్యాఖ్యలు

  • డాక్టర్ సుధాకర్ ది ఒక పెట్టీ కేసు
  • కేసును సీబీఐకి అప్పగించడంతో ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి
  • ఇలాంటి తీర్పులతో న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతుంది
YSRCP leader Amanchi controversial comments on High Court

వైజాగ్ డాక్టర్ సుధాకర్ పై పోలీసులు దాడి చేసిన కేసును ఏపీ హైకోర్టు సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. హైకోర్టు నిర్ణయంపై వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నచిన్న కేసులు కూడా సీబీఐకి అప్పగించడం మంచిది కాదని ఆయన అన్నారు. డాక్టర్ సుధాకర్ తరపున వేసిన పిటిషన్ ను హైకోర్టు సమర్థించడం సరికాదన్నారు. సామాన్య విషయాలకు సైతం సీబీఐ విచారణకు ఆదేశిస్తూ పోతే... చివరకు ప్రతి పోలీస్ స్టేషన్ ఉన్న చోట సీబీఐ ఆఫీసును ఏర్పాటు చేయాల్సి వస్తుందని చెప్పారు.

సుధాకర్ ది ఒక పెట్టీ కేసు అని... దీనిపై సీబీఐ విచారణ వేయడంతో రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆమంచి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ కేసును విచారించడానికి రాష్ట్రంలో ఒక్క నీజాయతీ కలిగిన అధికారి కూడా హైకోర్టుకు కనిపించలేదా? అని ప్రశ్నించారు. కోర్టు తీర్పులను ప్రశ్నించకూడదనే విషయం తనకు తెలుసని... కానీ, ఇలాంటి తీర్పులతో ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతుందని అన్నారు. వైసీపీ గెలిచి ఏడాది పూర్తైన సందర్భంగా నిర్వహించిన వేడుకల సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News