అనిత 'ఎక్స్' అకౌంట్ హ్యాక్.. పోలీసులకు ఫిర్యాదు
- అనిత ఎక్స్ ఖాతాలోకి చొరబడిన హ్యాకర్లు
- ఒక స్కామ్ లింక్ను ప్రొఫైల్లో పిన్ చేసిన వైనం
- రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు
ఏపీ హోంశాఖ మంత్రి అనిత అధికారిక 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతా సైబర్ నేరగాళ్ల బారిన పడింది. హ్యాకర్లు ఆమె ఖాతాను స్వాధీనం చేసుకుని... ప్రొఫైల్ డీపీ, పాత పోస్టులను కనిపించకుండా చేసి క్రిప్టోకరెన్సీకి సంబంధించిన ఒక స్కామ్ లింక్ను ప్రొఫైల్లో పిన్ చేశారు. 'FXRP' ఫైర్లైట్ ప్రోటోకాల్ సంస్థకు చెందిన రివార్డ్స్ పేరుతో ఉన్న ఈ అనుమానాస్పద పోస్ట్ ప్రత్యక్షమవ్వడంతో హ్యాకింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
తన సోషల్ మీడియా ఖాతా హ్యాకింగ్కు గురైన విషయాన్ని గుర్తించిన అనిత తక్షణమే స్పందించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులను గుర్తించి, చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ ఐజీ రవికృష్ణతో కూడా మాట్లాడి పరిణామాలపై చర్చించారు.
ఈ హ్యాకింగ్ వెనుక ఉద్దేశపూర్వక కుట్ర కోణం ఉండి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు... ఖాతాను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు, హ్యాకర్ల ఆచూకీని కనిపెట్టేందుకు ముమ్మర చర్యలు చేపట్టారు.