బీసీ మహిళ కాబట్టే వేటు వేశారు: కొండా సురేఖ బర్తరఫ్ పై శ్రీనివాస్ గౌడ్
- కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలనుకోవడం దారుణమన్న శ్రీనివాస్ గౌడ్
- ఈ కఠిన నిర్ణయం వెనుక బీసీ వ్యతిరేక ఆలోచన ఉందని మండిపాటు
- ఎంతోమంది కాంగ్రెస్ నేతలు రేవంత్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని వ్యాఖ్య
తెలంగాణ కేబినెట్ నుంచి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేయాలనే అంశంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకత్వం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఒక బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలిగించాలనుకోవడం దారుణమని, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 1000 రోజుల పాలనకు నిరసనగా నారాయణపేట జిల్లా కోస్గిలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన 'బీఆర్ఎస్ రైతు గర్జన' సభలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు నిత్యం ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా బహిరంగంగానే మాట్లాడుతున్నారని, కానీ కేవలం ఓ బీసీ మహిళా నాయకురాలిని మాత్రమే లక్ష్యంగా చేసుకుని పదవి నుంచి తొలగించడం కాంగ్రెస్ వైఖరికి అద్దంపడుతోందని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. సొంత పార్టీ మంత్రుల్లో కొందరికి ఒక న్యాయం, కొండా సురేఖకు మరొక న్యాయమా? అని నిలదీశారు. ప్రస్తుత కేబినెట్లోని పలువురు మంత్రులపై అవినీతి, కమీషన్ల ఆరోపణలు వెల్లువెత్తుతున్నా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోని ప్రభుత్వం, సురేఖ విషయంలో మాత్రం ఇంత కఠినంగా వ్యవహరించడం వెనుక బీసీ వ్యతిరేక ఆలోచనా ధోరణి ఉందని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీసీలను అనేక రకాలుగా మోసం చేస్తూ వస్తోందని, పదవుల తొలగింపులోనూ బడుగు, బలహీన వర్గాల నేతలనే బలిపశువులను చేస్తున్నారని విమర్శించారు. కొండా సురేఖ ఉద్వాసన కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయమైనప్పటికీ, ఒక బలమైన బీసీ నాయకురాలికి జరిగిన ఈ అన్యాయాన్ని ప్రజలు, బీసీ వర్గాలు గమనిస్తున్నాయని అన్నారు.