నాపై కాదు.. ముందు రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోండి: ఢిల్లీలో కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
- ఢిల్లీలో పార్టీ అధిష్ఠానాన్ని కలిసిన కొండా సురేఖ
- పార్టీలో బీసీ నేతలను టార్గెట్ చేస్తున్నారని విమర్శ
- అధిష్ఠానం తనను రాజీనామా చేయాలని కోరలేదని వెల్లడి
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ మంత్రి కొండా సురేఖ... సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె... తనపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పార్టీ పెద్దలను డిమాండ్ చేశారు.
తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిగా చేస్తూ చర్యలు తీసుకోవాలనుకోవడం సరికాదని సురేఖ స్పష్టం చేశారు. మహిళలు స్వతంత్రంగా జీవించాలని రాహుల్ గాంధీ ఎప్పుడూ చెబుతుంటారని అన్నారు. తన కుమార్తెను తీవ్రంగా రెచ్చగొట్టడం వల్లే ఆమె ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని చెప్పారు. పార్టీలో బీసీలకు ఒక న్యాయం... రెడ్డి సామాజిక వర్గాలకు మరో న్యాయమా? అని ప్రశ్నించారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎంతోమంది అనుచిత వ్యాఖ్యలు చేసినా చర్యలు తీసుకోలేదని, కేవలం బీసీలనే టార్గెట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు.
పదేళ్లు తానే సీఎంగా ఉంటానని రేవంత్రెడ్డి సొంతంగా చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం? అని సురేఖ ప్రశ్నించారు. రాష్ట్ర కేబినెట్లోని పలువురు మంత్రులపై అనేక ఆరోపణలు ఉన్నాయని.. రేవంత్ పాలనపై మంత్రులు, సీనియర్ నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు తనను రాజీనామా చేయమని అధిష్ఠానం కోరలేదని, జరిగిన పరిణామాలన్నింటినీ రాతపూర్వకంగా హైకమాండ్కు నివేదించినట్లు తెలిపారు.