ఎస్‍బీఐ ఖాతాదారులకు అలర్ట్... ఏటీఎం లావాదేవీల నిబంధనల్లో మార్పు!

SBI Alert Change in ATM Transaction Rules for Customers
  • ఎస్‍బీఐ శాలరీ ప్యాకేజ్ ఖాతాదారులకు కొత్త ఏటీఎం నిబంధనలు
  • ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఉచిత లావాదేవీల సంఖ్య 5కి తగ్గింపు
  • అక్టోబర్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్న కొత్త మార్పులు
  • పరిమితి దాటిన తర్వాత చేసే లావాదేవీలపై అదనపు చార్జీలు
భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) తన వినియోగదారులకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా శాలరీ ప్యాకేజీ ఖాతాదారులకు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో లభించే ఉచిత లావాదేవీల సంఖ్యను తగ్గిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త నిబంధనలు 2026 అక్టోబర్ 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.

ప్రస్తుతం ఎస్‍బీఐ శాలరీ ప్యాకేజీ ఖాతాదారులు ఇతర బ్యాంకులకు చెందిన ఏటీఎంలు లేదా ఆటోమేటెడ్ డెబిట్ కమ్ విత్‌డ్రాయల్ మెషీన్ల ద్వారా నెలకు 10 ఉచిత లావాదేవీలు చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే, సవరించిన నిబంధనల ప్రకారం ఈ ఉచిత లావాదేవీల సంఖ్యను 5కు పరిమితం చేశారు. పరిమితి దాటిన తర్వాత చేసే ప్రతి ఆర్థిక లావాదేవీకి (నగదు ఉపసంహరణ) రూ. 23తో పాటు జీఎస్టీ, అలాగే ఆర్థికేతర లావాదేవీలకు (బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్‌మెంట్ వంటివి) రూ. 11తో పాటు జీఎస్టీ చార్జీలుగా వసూలు చేయనున్నారు.

అయితే, ఈ మార్పు కేవలం శాలరీ ప్యాకేజీ ఖాతాదారులకు మాత్రమే వర్తిస్తుందని, అది కూడా ఇతర బ్యాంకుల ఏటీఎంలను ఉపయోగించినప్పుడు మాత్రమే వర్తిస్తుందని ఎస్‍బీఐ స్పష్టం చేసింది. ఎస్‍బీఐకి చెందిన సొంత ఏటీఎంలలో చేసే లావాదేవీలపై ఎటువంటి పరిమితులు, అదనపు చార్జీలు ఉండవని వెల్లడించింది. అదేవిధంగా, సాధారణ సేవింగ్స్ ఖాతాదారులకు ఈ కొత్త నిబంధనలతో సంబంధం లేదని, వారికి పాత నిబంధనలే యథాతథంగా కొనసాగుతాయని బ్యాంకు పేర్కొంది.
Advertisement
SBI
SBI ATM transaction rules
SBI salary account ATM charges
Free ATM withdrawal limit
SBI banking updates 2026

More Telugu News