‘‘ఎటు చూసినా విధ్వంసం, వికృతమే’’.. కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై కేటీఆర్‌ ఫైర్‌

KTR slams Congress 1000 days rule as destruction and distortion
  • కాంగ్రెస్‌ వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ ఛార్జ్‌షీట్‌ విడుదల
  • కాంగ్రెస్‌ అన్ని రంగాల్లో విఫలమైందని కేటీఆర్‌ విమర్శ
  • రూ.4.50 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపణ
  • రుణమాఫీ హామీని పూర్తిగా అమలు చేయలేదన్న కేటీఆర్‌
  • కాళేశ్వరం విషయంలో రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపణ
కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్‌ఎస్‌ ఛార్జ్‌షీట్‌ విడుదల చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు.

కాంగ్రెస్‌ పాలనలో ఎటు చూసినా విధ్వంసం, వికృతం కనిపిస్తోందని కేటీఆర్‌ ఆరోపించారు. ఇది వెయ్యి రోజుల పాలన కాదని.. ‘పీడన’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోను ఈ శతాబ్దపు అతిపెద్ద మోసంగా అభివర్ణించారు. పేదల భూములను నిషేధిత జాబితాలో పెట్టి 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. అభివృద్ధి పనులు పెద్దగా చేయకుండానే రాష్ట్ర ప్రభుత్వం రూ.4.50 లక్షల కోట్ల అప్పులు చేసిందని విమర్శించారు.

రూ.50 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి రూ.20 వేల కోట్లు మాత్రమే చేశారని కేటీఆర్‌ అన్నారు. రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి దేవుళ్లపై ఒట్టు పెట్టారని గుర్తుచేశారు. మాఫీ పూర్తిగా చేయకుండా 70 శాతం మంది రైతులను మోసం చేశారని ఆరోపించారు. కేసీఆర్‌ తెలంగాణను అన్నపూర్ణగా మార్చారని.. కాంగ్రెస్‌ ప్రభుత్వం దాన్ని నాశనం చేసిందని విమర్శించారు.

కాంగ్రెస్‌ పాలనలో ఢిల్లీకి మూటలు మోయడం, పదవుల కోసం కొట్లాడుకోవడం తప్ప మరేమీ లేదని కేటీఆర్‌ విమర్శించారు. రైతుబంధు పథకాన్ని నిలిపివేసి రాహుల్‌ బంధుకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. గోదావరి, కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగితే కాంగ్రెస్‌ను వదిలిపెట్టబోమని హెచ్చరించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్షతో రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. మిస్‌ వరల్డ్‌ పోటీలు, లియోనెల్ మెస్సీ కార్యక్రమాలకు భారీగా నిధులు ఖర్చు చేసిన ప్రభుత్వం, రైతులకు నీళ్లు ఇచ్చేందుకు మాత్రం డబ్బులు ఖర్చు చేయడం లేదని విమర్శించారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిందని కేటీఆర్‌ గుర్తుచేశారు. జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో జాబ్‌లెస్‌ క్యాలెండర్‌ ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో రాహుల్‌ గాంధీతో కలిసి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్‌ నేతలు.. తెలంగాణలో నిరుద్యోగులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు.
Advertisement
KTR
Telangana Congress 1000 Days
BRS Charge Sheet
Revanth Reddy Government
Telangana Loan Waiver
Telangana Politics

More Telugu News