నేపాల్ వరదల్లో కేంద్ర మాజీ మంత్రి ముకుల్ రాయ్ కోడలు గల్లంతు
- ట్రావెల్ ఏజెన్సీ ద్వారా కైలాస్-మానససరోవర్ యాత్రకు వెళ్లిన శర్మిష్ట భౌమిక్ రాయ్
- 32 మంది పర్యాటకుల బృందంతో కలిసి వెళ్లిన శర్మిష్ట
- నిన్న ఉదయం వరదల్లో చిక్కుకుపోయిన శర్మిష్ట
నేపాల్లో సంభవించిన ఆకస్మిక జలప్రళయం తీవ్ర నష్టాన్ని, అపార విషాదాన్ని మిగిల్చింది. ఈ భయంకరమైన ప్రకృతి విపత్తులో ఇప్పటివరకు మృతుల సంఖ్య 300కు చేరుకోగా, సుమారు 1,600 మందికి పైగా గల్లంతయ్యారు. వీరిలో దాదాపు 288 మంది వరకు భారతీయులే ఉన్నట్లు భావిస్తుండటంతో దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ బృందాలు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.
ఈ జలప్రళయంలో కేంద్ర మాజీ రైల్వే మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు ముకుల్ రాయ్ కోడలు, మాజీ ఎమ్మెల్యే శుభ్రాంశు రాయ్ భార్య శర్మిష్ట భౌమిక్ రాయ్ కూడా గల్లంతయ్యారు. ఆగస్టు 21న కోల్కతాకు చెందిన ఓ ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా కైలాస్-మానససరోవర్ యాత్ర నిమిత్తం బయలుదేరిన 32 మంది పర్యాటకుల బృందంలో ఆమె కూడా ఉన్నారు. ఆగస్టు 25 రాత్రి వరకు భర్తతో మాట్లాడిన శర్మిష్ట, బుధవారం ఉదయం నేపాల్-టిబెట్ సరిహద్దులోని రసువాగఢి ఇమ్మిగ్రేషన్ కార్యాలయం వద్ద ఉన్న సమయంలోనే ఊహించని విధంగా విరుచుకుపడిన వరదల్లో చిక్కుకున్నారు. ఆ సమయం నుంచే ఆమె ఫోన్ కలవకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర నిరాశ, ఆందోళనల్లో మునిగిపోయారు.